Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. ఐటీ కంపెనీలు, బిల్డర్ల ఇళ్లలో కొనసాగుతున్న తనిఖీలు!

హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 10 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందాలు  ఈ సోదాలు చేపట్టాయి.

enforcement directorate raids in hyderabad
Author
First Published Sep 19, 2022, 1:31 PM IST

హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 10 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందాలు  ఈ సోదాలు చేపట్టాయి. మూడు ఐటీ కంపెనీలతో పాటు కరీంనగర్‌కు చెందిన  బిల్డర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే రెండు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక, ఈ సోదాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించే ఈ దాడులు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు శుక్రవారం దేశవ్యాప్తంగా 40కి పైగా చోట్ల దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలొ కూడా సోదాలు జరిగాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 12 మంది వ్యక్తులు, 18 కంపెనీలకు ఆబానోటీసులు అందజేసింది. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల్లో ఒకరైన రామచంద్రన్ పిళ్లై యాజమాన్యంలోని రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయంలో కూడా ఈడీ సోదాలు నిర్వహించారు. అదే సమయంలో దోమలగూడ అరవింద్‌ కాలనీలోని శ్రీ సాయికృష్ణ అపార్ట్‌మెంట్‌లో చార్టెడ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబుకు చెందిన గోరంట్ల అసోసియేట్స్‌ కార్యాలయం, నివాసంపై కూడా దాడులు చేశారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది సహకారంతో ఈడీ అధికారులు బుచ్చిబాబు నివాసం, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పలు కంపెనీలకు చెందిన భారీ ఫైళ్లను గుర్తించారు.


గచ్చిబౌలిలోని అభిషేక్ నివాసం, మాదాపూర్‌లోని అనూస్ ప్రధాన కార్యాలయంలో ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహించారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన ఢిల్లీ, నెల్లూరు నివాసాల్లోనూ ఏకకాలంలో సోదాలు జరిగాయి. నెల్లూరులోని కోటిమొబ్బ సెంటర్‌లో ఉన్న శ్రీనివాసులు కార్యాలయం, చెన్నైలోని మాగుంట అగ్రి ఫారంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈడీ నుంచి నోటీసులు అందుకున్నవారిలో అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ఐఏఎస్ అధికారి అర్వ గోపీ కృష్ణ, రఘు మాగుంట, అభిషేక్, గోరంట్ల బుచ్చిబాబు, చందన్ రెడ్డి, వై. శశికళ తదితరులు ఉన్నారు. అనంతరం ఈ కేసులో రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆదివారం ఆయనను కొన్ని గంటల పాటు అధికారులు విచారించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios