ఎమ్మెల్యేల కొనుగోలు కేసు .. నందకుమార్ కస్టడీకి అనుమతించండి : నాంపల్లి కోర్టులో ఈడీ పిటిషన్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణను ఈడీ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా నందకుమార్ను కస్టడీకి అనుమతించాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఈడీ ఆశ్రయించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా వున్న నందకుమార్ను కస్టడీలోకి తీసుకోవాలని ఈడీ భావిస్తోంది. దీనిలో భాగంగా అతనిని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టును ఈడీ ఆశ్రయించింది. గుట్కా మనీలాండరింగ్, రోహిత్ రెడ్డి పాత్రపై నందకుమార్ని ప్రశ్నించాలని ఈడీ భావిస్తోంది. మరోవైపు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మనీలాండరింగ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమానిస్తోంది. డిసెంబర్ 15న ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని రెండు రోజుల పాటు ఈడీ ప్రశ్నించింది. అలాగే 7 హిల్స్ మాణిక్ చంద్ యజమాని అభిషేక్ ఆవులను కూడా విచారిస్తోంది.
కాగా... ఈ నెల 16వ తేదీన పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే తనకు ఈ నెల 31 వరకు సమయం ఇవ్వాలని రోహిత్ రెడ్డి కోరారు. ఈ విషయమై ఈడీ అధికారులకు తన పీఏ ద్వారా లేఖను పంపారు రోహిత్ రెడ్డి. కానీ ఎమ్మెల్యేకి సమయం ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం తొలి రోజు రోహిత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సోమవారం నాటి విచారణకు కొనసాగింపుగా మంగళవారం కూడా రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు.
ALso REad: 7 హిల్స్ మాణిక్ చంద్ యజమాని అభిషేక్కు ఈడీ నోటీసులు.. నందకుమార్, రోహిత్ రెడ్డి సోదరుడితో లావాదేవీలు
సోమవారం ఆరుగంటల పాటు జరిగిన విచారణలో కేవలం తన బయోడేటా గురించి మాత్రమే ఈడీ అధికారులు అడిగారని పైలెట్ రోహిత్ రెడ్డి చెప్పారు. తనను ఏ కేసులో విచారణ చేస్తున్నారో చెప్పాలని పదే పదే అడిగినా కూడా తనకు ఈడీ అధికారులు సమాచారం ఇవ్వలేదన్నారు. తన వ్యాపారాలు , కుటుంబ సభ్యుల సమాచారాన్ని మాత్రమే ఈడీ అధికారులు అడిగినట్టుగా రోహిత్ రెడ్డి చెప్పారు.