7 హిల్స్ మాణిక్ చంద్ యజమాని అభిషేక్కు ఈడీ నోటీసులు.. నందకుమార్, రోహిత్ రెడ్డి సోదరుడితో లావాదేవీలు
7 హిల్స్ మాణిక్ చంద్ యజమాని అభిషేక్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. నందకుమార్, అభిషేక్, ఎమ్మెల్యే రోహిత్ సోదరుడి మధ్య లావాదేవీలు చోటు చేసుకున్నట్లుగా ఈడీ అనుమానిస్తోంది.
7 హిల్స్ మాణిక్ చంద్ యజమాని అభిషేక్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని అభిషేక్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్పై గతంలో అభిషేక్ ఫిర్యాదు చేశారు. నందకుమార్, అభిషేక్, ఎమ్మెల్యే రోహిత్ సోదరుడి మధ్య లావాదేవీలు చోటు చేసుకున్నట్లుగా ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విచారించింది ఈడీ. రూ.7.70 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించింది.
కాగా... ఈ నెల 16వ తేదీన పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే తనకు ఈ నెల 31 వరకు సమయం ఇవ్వాలని రోహిత్ రెడ్డి కోరారు. ఈ విషయమై ఈడీ అధికారులకు తన పీఏ ద్వారా లేఖను పంపారు రోహిత్ రెడ్డి. కానీ ఎమ్మెల్యేకి సమయం ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం తొలి రోజు రోహిత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సోమవారం నాటి విచారణకు కొనసాగింపుగా మంగళవారం కూడా రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు.
Also Read : రెండో రోజూ ఈడీ విచారణ: హాజరైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
సోమవారం ఆరుగంటల పాటు జరిగిన విచారణలో కేవలం తన బయోడేటా గురించి మాత్రమే ఈడీ అధికారులు అడిగారని పైలెట్ రోహిత్ రెడ్డి చెప్పారు. తనను ఏ కేసులో విచారణ చేస్తున్నారో చెప్పాలని పదే పదే అడిగినా కూడా తనకు ఈడీ అధికారులు సమాచారం ఇవ్వలేదన్నారు. తన వ్యాపారాలు , కుటుంబ సభ్యుల సమాచారాన్ని మాత్రమే ఈడీ అధికారులు అడిగినట్టుగా రోహిత్ రెడ్డి చెప్పారు.