టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో  కీలక పరిణామం చోటు  చేసుకుంది.  టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్, సెక్రటరీలను ఇవాళ ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

హైదరాబాద్; టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఈడీ అధికారులు దూకుడును పెంచారు. టీఎస్‌సీఎస్‌సీ చైర్మెన్ , సెక్రటరీలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై వీరిద్దరిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ నోటీసులు జారీ చేయడంతో సోమవారంనాడు ఈడీ విచారణకు టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ జనార్ధన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ లు హాజరయ్యారు. 

టీఎస్‌పీఎస్‌సీలో సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి, టీఎస్‌పీఎస్‌‌సీ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణలను కూడా ఈడీ అధికారులు ఇదివరకే ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో భారీగా డబ్బులు చేతులు మారినట్టుగా సిట్ దర్యాప్తు బృందం తేల్చింది. పేపర్ లీక్ స్కాంలో రూ. 31 లక్షలు చేతులు మారినట్టుగా సిట్ బృందం తేల్చింది.

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ స్కాం కేసులో మనీలాండరింగ్ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. 

ఈ ఏడాది మార్చి మాసంలో టీఎస్‌పీఎస్‌సీ కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని భావించి టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామాకానికి సంబంధించిన పరీక్షలను వాయిదా వేశారు. ఈ ఏడాది మార్చి 12, 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను వాయిదా వేశారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలోని కంప్యూటర్లు హ్యాక్ కాలేదని పేపర్ లీక్ అయిందని బేగంపేట పోలీసులు గుర్తించారు.

ఈ విషయమై విచారణ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఇప్పటికే 19 మంది నిందితులను ఈ కేసులో సిట్ బృందం అరెస్ట్ చేసింది. టీఎస్‌పీఎస్‌సీలో పనిచేసే ఉద్యోగులు ఈ విషయంలో కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశానికి సంబంధించి విపక్షాలు తెలంగాణ మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. 

also read:ప్రస్తుత దశలో ఎలాంటి ఉత్తర్వులివ్వలేం: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు విచారణ జూన్ 5కి వాయిదా

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశానికి సంబంధించి విపక్షాలు తెలంగాణ మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. గత ఏడాది అక్టోబర్ మాసం నుండి నిర్వహించిన కొన్న పరీక్షల పేపర్లు లీకయ్యాయని సిట్ గుర్తించింది. దీంతో కొన్ని పరీక్షలను రద్దు చేశారు. మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది టీఎస్‌పీఎస్‌సీ. మరో వైపు రద్దైన, వాయిదా పడిన పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది.