కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ కేసులో తాను రేపు విచారణకు హాజరవుతానని ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కనుగోలు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ కేసులో తాను రేపు విచారణకు హాజరవుతానని ఎన్నికల వ్యుహాకర్త సునీల్ కనుగోలు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో సునీల్ కనుగోలును రేపు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రశ్నించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు ప్రముఖుల కించపరిచేలా పోస్టింగ్లు చేస్తున్నారనే ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు.. మాదాపూర్లోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్ రూమ్పై దాడులు నిర్వహించారు.
ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఇషాన్ శర్మ, తాతినేని శశాంక్, శ్రీప్రతాప్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలు అని పేర్కొన్న పోలీసులు ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41(ఎ) కింద నోటీసులు జారీచేసి.. వివరణతో డిసెంబర్ 30న తమ ముందు హాజరుకావాలని సూచించారు.
సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సునీల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అయితే అతనిని అరెస్టు చేయవద్దని పోలీసులను ఈ నెల 3వ తేదీన హైకోర్టు ఆదేశించింది. అలాగే విచారణకు హాజరు కావాలని సునీల్ కనుగోలుకు సూచించింది. ఈ క్రమంలోనే జనవరి 8న విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే నేడు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. తాను రేపు విచారణకు హాజరవుతానని సునీల్ కనుగోలు పోలీసులకు తెలిపారు.
