ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణకు సంబంధించి ఆమె లీగల్ టీమ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి పిలుపు వెళ్లింది. దీంతో  కవిత న్యాయవాది సోమా భరత్‌ , బీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్‌లు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.  

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ కొనసాగుతోంది. ఈడీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 7.30 గంటలుగా కవితను ఈడీ విచారిస్తోంది. అయితే సాయంత్రం ఈడీ ఆఫీస్ నుంచి కవిత న్యాయవాది సోమా భరత్‌కు పిలుపు రావడంతో ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. భరత్‌తో పాటు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ కూడా వున్నారు. ఈ సందర్భంగా ఈడీ అడిగిన సమాచారాన్ని సోమా భరత్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో ఈడీ కార్యాలయం వద్దకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షణ్ విధించారు. 

అంతకుముందు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరిన సమయంలో.. కవిత తన కారులో నుంచి బయటకు వచ్చి కవర్‌లలో ప్యాక్ చేసి ఉన్న తన ఫోన్‌లను మీడియా ఎదుట ప్రదర్శించారు. అనంతరం ఈడీ కార్యాలయానికి కవిత చేరుకున్నారు. ఈడీ కార్యాలయం వద్ద కూడా కవిత మరోసారి తన ఫోన్లను మీడియా ముందు ప్రదర్శించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే రెండు సార్లు కవితను విచారించిన ఈడీ అధికారులు.. నేడు మరోసారి విచారిస్తున్నారు. తొలుత ఈ నెల 11న కవితను దాదాపు 8 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు.. సోమవారం దాదాపు 10 గంటలకు పైగా ఆమెను విచారించారు. నిన్న రాత్రి 9 గంటల తర్వాత కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. వరుసగా రెండో రోజు కవితను ఈడీ అధికారులు విచారించనుండటంతో.. ఈరోజు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. 

ALso REad: ఏడున్నర గంటలుగా సాగుతోన్న కవిత విచారణ.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

అయితే ఈరోజు విచారణలో కవిత ఫోన్ డేటాపై ఈడీ అధికారులు దృష్టిసారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు దొరక్కుండా కవిత తన వద్ద ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాను ఎలాంటి ఫోన్లను ధ్వంసం చేయలేదని కవిత చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈడీ ముందు సమర్పించనున్న మొబైల్ ఫోన్లను కవిత మీడియా ముందు ప్రదర్శించారు. 

మరోవైపు.. ఈడీకి మంగళవారంనాడు కవిత లేఖ రాశారు. తనను రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నారని ఈడీకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. తనపై ఈడీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆ లేఖలో కవిత ఆరోపించారు. గతంలో తాను ఉపయోగించిన అన్ని ఫోన్లను ఈడీకి అందిస్తున్నానని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. తాను ఫోన్లను ధ్వంసం చేశానని తప్పుడు ప్రచారం చేశారని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. ఏ ఉద్దేశ్యంతో ఇలా చేశారని ఆమె ప్రశ్నించారు. మహిళ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం స్వేచ్ఛకు భంగం కల్గించడమేనని కవిత పేర్కొన్నారు. ఫోన్ల విషయంలో కనీసం సమన్లు కూడా ఇవ్వలేదని కవిత గుర్తు చేశారు. 2022 నంబర్ మాసంలోనే తాను ఫోన్లను ధ్వంసం చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేశారని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణకు సహకరిస్తున్నట్టుగా కవిత ఆ లేఖలో ప్రస్తావించారు.