కొత్త ముహూర్తం: ఈ నెల 13న బిజెపిలోకి ఈటెల రాజేందర్
తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 13వ తేదీన బిజెపిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ బిజెపిలో చేరుతారని అంటున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, మాజీ టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ బిజెపిలో చేరే కొత్త తేదీ ప్రచారంలోకి వచ్చింది. ఆయన ఈ నెల 13వ తేదీన బిజెపిలో చేరుతారని చెబుతున్నారు. బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటున్నారని అంటున్నారు.
ఈటెల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ కూడా బిజెపిలో అదే రోజు చేరే అవకాశం ఉంది.
ఈటెల రాజేందర్ ఈ నెల 11వ తేదీ తర్వాత బిజెపిలో చేరుతారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన టీఆర్ఎస్ పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో బిజెపిలో చేరడానికి ఆయన లైన్ క్లియర్ చేసుకున్నారు.
ఈటెల రాజేందర్ రాజీనామా వల్ల హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గం ఖాళీ అవుతుంది. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారనుంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుజూరాబాద్ లో పార్టీ విజయానికి కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు.
ఇప్పటికే ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి జెపి నడ్డాతోనూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శితోనూ చర్చలు జరిపారు. బిజెపిలో చేరడానికి లైన్ క్లియర్ కాగానే ఆయన శాసనసభా సభ్యత్వానికి, టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.