కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు డీఎస్ వెళ్లారు- వీ.హనుమంతరావు
కాంగ్రెస్ ఇబ్బందుల్లో ఉన్నసమయంలో ధర్మపురి శ్రీనివాస్ పార్టీని విడిచి వెళ్లారని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. ఇప్పుడెందకు ఆయన పార్టీలోకి వస్తున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు డీఎస్ పార్టీని విడిచివెళ్లిపోయారని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్కు వస్తున్నారని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ డీఎస్కు అన్నీ ఇచ్చిందని అన్నారు. రెండు పర్యాయాలు ఆయన ఏపీసీసీ ప్రెసిడెంట్గా పని చేశారని అన్నారు. అంత పెద్ద పదవులు కట్టబెట్టిన పార్టీనీ డీఎస్ మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లారని అన్నారు. పార్టీ అధికారంలో లేదని టీఆర్ఎస్కు వెళ్లారని తెలిపారు. నిజామాబాద్ కు చెందిన స్థానిక లీడర్లు ఫోన్ చేసి బాధపడుతున్నారని చెప్పారు. పార్టీని అలాంటి సమయంలో విడిచి వెళ్లిన డీఎస్ ఇప్పుడు ఎందుకు వస్తున్నారని కార్యకర్తలు తనతో చెప్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆయన ఒక్కడే కాంగ్రెస్లోకి రావడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందని అన్నారు. ధర్మపురి అర్వింద్ను కూడా తీసుకురావాలని సూచించారు. రాజ్యసభ పదవి కాలం అయిపోతుందనే డీఎస్ కాంగ్రెస్లోకి వస్తున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్లో చేరినా అంటీ ముట్టనట్టే..
కాంగ్రెస్ లో ఎన్నో ఉన్నత పదువులు అనుభవించిన డీఎస్ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే సరికి ఆ పార్టీలో చేరారు. సీనియర్ నాయకుడు కావడంతో ఆయనను సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా పంపించేశారు. కొన్ని రోజులు అంతా బాగానే ఉన్న.. తరువాత పార్టీకీ ఆయనకు మధ్య విభేదాలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి పార్టీకి అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. పార్టీకి చెందిన ఎలాంటి కార్యక్రమాల్లో, అధికారిక కార్యక్రమాల్లో కూడా డీఎస్ పాల్గొనలేదు. ఒక దశలో ఆయనను రాజ్యసభ ఎంపీ పదవిని వెరొకరికి కట్టబెడుతారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అలాంటిదేమీ జరుగలేదు. కానీ తను మాత్రం టీఆర్ఎస్ రెబల్ ఎంపీగా మిగిలిపోయారు. ఒక పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉండి అదే పార్టీకి రెబల్ గా మారిన వ్యక్తి రాష్ట్ర రాజకీయ చరిత్రల్లో దాదాపుగా డీఎస్ ఒక్కరేనేమో. కొన్ని సార్లు టీఆర్ఎస్ పార్టీపై బహిరంగానే విమర్శలు చేశారు. అవసరమైతే తన పదవిని తీసేయాలని సూచించారు. కానీ టీఆర్ఎస్ అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదు. డీఎస్పై టీఆర్ఎస్ కూడా ఎలాంటి విమర్శలు చేయలేదు. ఆయన విషయంలో దాదాపు సైలెంట్ గానే ఉంటోంది.
హనుమకొండలో క్వారీలో టిప్పర్ లారీ బోల్తా.. ముగ్గురు మృతి
ఎందుకు యూ టర్న్ నిర్ణయం..
డీఎస్ కు రాజకీయాల్లో మంచి పేరు ఉంది. ఉమ్మడి ఏపీలోనే ఆయన మంచి పదవుల్లో ఉన్నారు. రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్లో రాజకీయ కురవృద్ధుడిగా పేరు సంపాదించిన ఆయన కాంగ్రెస్ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో మంత్రిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పేరు మోసిన ఆయన కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఆయనకు టీఆర్ఎస్ లో అనుకున్నంత గౌరవం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తిగా ఉన్న డీఎస్ కు టీఆర్ఎస్ వ్యవహార శైలి నచ్చలేదు. దీంతో టీఆర్ఎస్కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఎన్నో రాజకీయ పదువులు ఇచ్చిన కాంగ్రెస్లోనే తన చరమాంకం గడపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ దగ్గర చర్చింనట్టు సమాచారం. దానికి ఆమెకు సమ్మతించినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరి కొన్ని రోజుల్లో డీఎస్ అధికారికంగా కాంగ్రెస్ లో చేరనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్ పదవి కాలం మరో మూడు నెలల్లో ముగియనుంది.