మహిళలు ఏ విషయంలో తక్కువ కాదు: నారాయణమ్మ కాలేజీ విద్యార్ధులతో ముర్ము ముఖాముఖి
మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఇవాళ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధులతో రాష్ట్రపతి ముఖాముఖి నిర్వహించారు.
హైదరాబాద్: మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. హైద్రాబాద్ షేక్పేట నారాయణమ్మ కాలేజీల్లో గురువారంనాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రీసెర్చ్ , డెవలప్ మెంట్స్ ను మరింత ప్రోత్సహించాలని రాష్ట్రపతి ముర్ము కోరారు.అన్ని రంగాల్లో ఇంజనీరింగ్ పాత్ర ఎక్కువగా ఉంటుందని ఆమె చెప్పారు. మేకిన్ ఇండియాను ప్రోత్సహించాలని రాష్ట్రపతి ముర్ము కోరారు. ఇన్నోవేటివ్ టెక్నాలజీపై ఫోకస్ పెట్టాలని రాష్ట్రపతి కోరారు.
అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందన్పారు. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు దేశంలో 14 ఐఐటీలుంటే 23కి పెంచినట్టుగా చెప్పారు. ఐఐఐఎంలలను 23కి పెంచినట్టుగా కిషన్ రెడ్డి వివరించారు. అవసరమైన చోట ఐఐటీలు , ఐఐఐఎంలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్దంగా ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. 82 వేల మెడికల్ సీట్లను 1, 63 వేలకు పెంచినట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ఎంబీబీఎస్ 87, పీజీ సీట్లను 107 శాతానికి పెంచిన విషయాన్ని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు.ప్రైవేట్ యూనివర్శిటీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. దీంతో దేశంలో 1,156 ప్రైవేట్ యూనివర్శిటీలు పని చేస్తున్నాయన్నారు. ప్రతి 100 టాప్ ర్యాంకు యూనివర్శిటీల్లో 60 యూనివర్శిటీలు ఇండియాకు చెందినవేనని కిషన్ రెడ్డి తెలిపారు.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్ వచ్చిన తర్వాత నగరంలోని పలు విద్యాసంస్థల్లోని విద్యార్ధులతో ముర్ము ముఖాముఖి నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ నెల 30వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి ముర్ముతో పాటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లున్నారు.