సారాంశం
బీఆర్ఎస్ నేత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయన్నారు. తమకు ఓటు వేసిన వారికే పథకాల్లో చోటు వుంటుందన్నారు.
బీఆర్ఎస్ నేత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ సభలో ప్రసంగించిన ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయన్నారు. తమకు ఓటు వేసిన వారికే పథకాల్లో చోటు వుంటుందన్నారు. అయితే రెడ్యా నాయక్ ప్రసంగానికి కొందరు యువకులు అడ్డు తగిలారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అదుపు చేశారు.
కాగా.. డోర్నకల్ నియోజకవర్గం అధికార బీఆర్ఎస్లో రాజకీయం వేడెక్కింది. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయ పరిస్థితులు మారాయి. డోర్నకల్లో పోటీకి సంబంధించి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్లు చేస్తున్న గులాబీ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాట్లాడుతూ.. సీటు కోసం గుంట నక్కలు కూర్చొని ఉన్నాయని కామెంట్ చేశారు. అయితే కేసీఆర్ మాత్రం డోర్నకల్ నుంచి రెడ్యా నాయక్కే మరోసారి అవకాశం కల్పించారు.
ఇక, సత్యవతి రాథోడ్ గతంలో డోర్నకల్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014లో బీఆర్ఎస్లో చేరిన సత్యవతి రాథోడ్.. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ నుంచి పోటీ చేసి.. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రెడ్యా నాయక్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొన్ని నెలలకే రెడ్యా నాయక్ గులాబీ గూటికి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన రెడ్యా నాయక్ విజయం సాధించారు. ఇక, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సత్యవతి రాథోడ్.. రాష్ట్ర కేబినెట్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్ మధ్య రాజకీయ వైరం ఉన్న సంగతి బహిరంగమే.