Errabelli Dayakar Rao: కాంగ్రెస్ పాల‌న‌లో రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు, స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నార‌ని అధికార పార్టీ నాయ‌కుడు, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలించినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అలాగే, స్థానికుల సమస్యలను అమెరికాకు చెందిన అభ్యర్థి ఎలా పరిష్కరిస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. 

Telangana Assembly Elections 2023: అవినీతి కాంగ్రెస్‌ కావాలా లేక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని బీఆర్‌ఎస్‌ కావాలా? అని ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరులో క్యాడర్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. "కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (కేఎల్‌ఐపీ)ని నిర్మించడం ద్వారా వ్యవసాయానికి ఊతమిచ్చేలా సాగునీటి సౌకర్యాన్ని కేసీఆర్ కల్పించారు. కేసీఆర్ విద్యుత్ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడమే కాకుండా రైతాంగానికి 24 గంటలూ ఉచితంగా సరఫరా చేసేలా చేశారు" అని ఎర్రబెల్లి అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతు బంధు, రైతు బీమా ప్రారంభించలేదని ఆయన తెలిపారు. నగదు సంచులతో రాజకీయాలు చేయాలనుకునే వారిని ఎంట‌ర్టైన్ చేయవద్దని ఆయన ప్రజలను కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మెరుగైన పాల‌న‌తో అన్ని తాండాలు ఇప్పుడు స్వయం పాలక గ్రామ పంచాయతీలుగా మారాయ‌నీ, కనీస మౌలిక సదుపాయాలు- స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉన్నాయ‌ని మంత్రి ఎర్రబెల్లి అన్నారు, కాంగ్రెస్ త‌ప్పుడు వాగ్దానాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్ర‌మంలో పాలుపంచుకున్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఏ విధంగా అమలు చేస్తుందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ఆమె నిలదీశారు.

పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లికి పోటీగా అమెరికాకు చెందిన హనుమాండ్ల ఝాన్సీ కోడలు మనస్విని కాంగ్రెస్ బరిలోకి దింపుతున్నట్లు సమాచారం. అమెరికాకు చెందిన అభ్యర్థి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ఆమె అన్నారు. ఓటుకు నోటు కుంభకోణానికి పాల్పడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్నారని రాథోడ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. పాలకుర్తి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధిని ప్రస్తావిస్తూ ఎర్రబెల్లిని మళ్లీ బంపర్ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఛారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.