చిన్నారులపై పిచ్చికుక్కల దాడి...ముఖం పీక్కుతినడంతో బాలిక మృతి
కొమరంభీం జిల్లాలో దారుణం జరిగింది. చిన్నారులపై పిచ్చికుక్కలు దాడి చేయడంతో ఓ చిన్నారి మరణించింది. వివరాల్లోకి వెళితే.. చింతలమానేపల్లి మండలం బాబాసాగార్ గ్రామానికి చెందిన జాడి తిరుపతి, స్వప్నలకు మూడేళ్ల కుమార్తె సింధు శుక్రవారం తన ఇంటి వద్ద తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది.
కొమరంభీం జిల్లాలో దారుణం జరిగింది. చిన్నారులపై పిచ్చికుక్కలు దాడి చేయడంతో ఓ చిన్నారి మరణించింది. వివరాల్లోకి వెళితే.. చింతలమానేపల్లి మండలం బాబాసాగార్ గ్రామానికి చెందిన జాడి తిరుపతి, స్వప్నలకు మూడేళ్ల కుమార్తె సింధు శుక్రవారం తన ఇంటి వద్ద తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది.
ఈ సమయంలో అటుగా వచ్చిన కొన్ని పిచ్చికుక్కలు చిన్నారులపై విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనలో సింధుతో పాటు శ్రీదేవి అనే మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు ఇద్దరిని కాగజ్నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ముఖంపై తీవ్రగాయాలు కావడంతో ఇద్దరి పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో సింధు చికిత్స పొందుతూ శనివారం మరణించింది. మరో చిన్నారి కోలుకుంటోంది. మరోవైపు ఈ ఘటనపై గ్రామస్తులు మండిపడుతున్నారు.
గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, వీటి బారి నుంచి కాపాడాలని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల బెడదపై కాగజ్నగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వార్డు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన అధికారులు పట్టణ వ్యాప్తంగా ఉన్న సుమారు 90 కుక్కలను పట్టుకుని సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు.