ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకంతో ఓ మహిళను బతికుండగానే చనిపోయిందని ప్రకటించారు. అయితే, అది నమ్మని తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఆమె బతికింది. 

జహీరాబాద్ : ’అపస్మారక స్థితిలో ఉన్న మా బిడ్డను 
Zaheerabad ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్తే అక్కడి డాక్టర్ చనిపోయిందని ధ్రువీకరించారు. బ్రాట్ డెడ్ (ఆసుపత్రికి వచ్చేలోపే చనిపోయినట్లు) అని చీటీ రాసి మా చేతిలో పెట్టేశారు. మాకు నమ్మకం కుదరక మేము సంగారెడ్డి Private hospitalకి తీసుకువెళ్లాం. డాక్టర్లు బతికే ఉందన్నారు. చికిత్స అందించి కోలుకునేలా చేశారు’ అని బాధిత యువతి తల్లిదండ్రులు వాపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై వారు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్ కు చెందిన అర్చన (20)కు ఇటీవల munipally మండలం తాటిపల్లికి చెందిన యువకుడితో వివాహం అయ్యింది. 

ఉపవాస దీక్షలో ఉన్న అర్చన మే 7న తెల్లవారుజామున అత్తవారింట్లో కిందపడిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భర్త వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి, జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డ్యూటీలో ఉన్న జనరల్ సర్జన్ డా. సంతోష్ పరీక్షించి, చనిపోయినట్లు చెప్పి ఆసుపత్రికి చీటీపై ‘బ్రాట్ డెడ్’ అని రాసి ఇచ్చారు. ఆస్పత్రి రిజిస్టర్లో సంతకం చేయించుకున్నారు.

బతికించిన నమ్మకం…
వైద్యుడు చెప్పింది నమ్మని అర్చన తల్లిదండ్రులు నర్సింహులు, శారద జహీరాబాద్ నుంచి సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అక్కడి వైద్యులు ఆమె బ్రతికి ఉన్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యం అందించారు. మే 22న డిశ్చార్జి చేశారు. ప్రభుత్వ వైద్యుడు నిర్వాకంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం లక్షల్లో ఖర్చు పెట్టుకున్నామని బాధితులు వాపోతున్నారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే ఆస్పత్రి రిజిస్టర్ లో అర్చన చనిపోయినట్లు రాసిన పేజీలోని స్థలంలో.. కొత్తగా కాగితం అతికించి, మరో ఆస్పత్రికి సిఫార్సు చేసినట్లు వ్రాసి ఉండటం గమనార్హం.

రెండో ఈసీజీ తో రిఫర్ చేశారు..
యువతి అపస్మారక స్థితిలో ఆస్పత్రికి రాగానే డ్యూటీ డాక్టర్ సంతోష్ ఈసీజీ తీసి పల్స్ సింగిల్ లైన్ రావడంతో చనిపోయిందని చీటీ రాసిచ్చారు. తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవడంతో మళ్లీ ఈసీజీ తీస్తే పల్స్ ఉన్నట్లు చూపించింది. మొదటి చీటీని చింపేసి రెండో చీటీ లో మరో ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. పాత చీటీని ఫోటో తీసుకుని, వైద్యుడిపై యువతి కుటుంబం ఆరోపణలు చేయడం సరికాదు అని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శేషు పద్మనాభరావు అన్నారు. 

ఇలాంటి ఘటనే, మే 24న జమ్మూకాశ్మీర్ లో జరిగింది. నవజాతశిశువు చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు దృవీకరించాయి. ఆ శిశువును అంత్యక్రియలకు తీసుకుపోతుండగా ఒక్కసారిగా కదిలింది. దీంతో శిశువు బతికే ఉందని తెలిసి ఆ తల్లిదండ్రులు సంతోషంతో పొంగిపోయారు. బతికి ఉన్న శిశువును చనిపోయినట్లు ధృవీకరించిన వైద్యుల మీద మండిపడుతున్నారు. ఈ ఘటన జమ్మూ కాశ్మీర్‌ రాంబన్‌లోని సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బనిహాల్‌లో సోమవారం జరిగింది. ఇది ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమే అని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిముందు బైఠాయించారు. ఈ ఘటన అధికారులకు చేరడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. ఘటన పూర్వాపరాలు గమనించిన అధికారులు, శిశువు కుటుంబ సభ్యుల నిరసనలకు దిగడంతో ఇద్దరు ఆసుపత్రి ఉద్యోగులను సస్పెండ్ చేశారు.