దిశ నిందితుల ఎన్కౌంటర్: బుల్లెట్ గాయాలివే, పోస్టుమార్టం రిపోర్ట్ ఇదీ...
దిశ నిందితుల ఎన్కౌంటర్ కు సంబంధించి పోస్టుమార్టం నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్ సమయంలో మృతుల శరీరంలో బుల్లెట్ల గాయాలు తప్పా ఒక్క చోట బుల్లెట్ కూడ లభించలేదని సమాచారం. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం మృతుల శరీరాల్లో నుండి ఒక్క బుల్లెట్ నుండి లేదని తేలినట్టు తెలుస్తోంది.
Also read:దిశ ఫ్యామిలీకి ఎన్హెచ్ఆర్సీ నుండి పిలుపు
దిశపై గ్యాంగ్రేప్ కు పాల్పడి హత్య చేసిన నలుగురు నిందితులను ఈ నెల 6వ తేదీన చటాన్పల్లిలో పోలీసుల ఎన్కౌంటర్ లో మృతి చెందారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.
ఏ-1 నిందితుడు మహ్మద్ ఆరిఫ్ శరీరంలో నాలుగు చోట్ల బుల్లెట్ గాయాలున్నట్టుగా పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. రెండు బుల్లెట్ గాయాలు ఛాతీలో, ఒకటి పక్కటెముకలో దిగినట్టుగా పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం తేలుస్తోంది. మరో గాయం వీపు ప్రాంతంలో దిగిందని సమాచారం.
ఇక ఏ-2 నిందితుడు శివ శరీరంపై మూడు బుల్లెట్ గాయాలు ఉన్నట్టుగా ఈ రిపోర్టు చెబుతోంది.రెండు బుల్లెట్ గాయాలు కిడ్నీ లో, మరోటి వెనుక భాగంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
దిశ కేసులో మూడో నిందితుడు నవీన్ దేహంలో మూడు చోట్ల బుల్లెట్ గాయాలున్నాయి. ఇందులో ఒకటి తలలో నుండి వెళ్లాయి. రెండు బుల్లెట్లు చాతీలో నుండి వెళ్లినట్టుగా సమాచారం. ఇక ఏ-4 నిందితుడు చెన్నకేశవులు శరీరంలో ఒక్క బుల్లెట్ గాయం మాత్రమే ఉన్నట్టుగా పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. చెన్నకేశవులు గొంతు నుండి ఈ బుల్లెట్ వెళ్లినట్టుగా తెలుస్తోంది.
నిందితులకు పోలీసులకు మధ్య అతి సమీపం నుండి కాల్పులు జరిగినట్టుగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే నిందితుల శరీరం నుండి బుల్లెట్లు బయటకు వెళ్లినట్టుగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
దూరం నుండి కాల్పులు జరిగితే నిందితుల శరీరాల్లో బుల్లెట్లు ఉండేవనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం నిందితుల మృతదేహాలు జడ్చర్ల మెడికల్ కాలేజీలో భద్రపర్చారు. నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే విషయమై సోమవారం నాడు హైకోర్టు ఏ రకమైన ఆదేశాలు ఇవ్వనుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.