కేటీఆర్ ఇలాకాలో దారుణం... డబుల్ బెడ్రూం ఇంటికోసం ఆత్మహత్య (Video)
డబుల్ బెడ్రూం ఇళ్లు రాకపోడంతో సొంతిటి కల నిజమవలేదన్న బాధతో ఓ వ్యక్తి భార్యా, పిల్లలకు అన్యాయం చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించిఇస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా సొంతిటి కల నిజమవలేదన్న బాధతో అతడు భార్యా, పిల్లలకు అన్యాయం చేశాడు. ఈ ఘటన మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన శిలువేరి గౌతమ్-ప్రవళిక దంపతులు. వీరు కూతురు లాస్య, కుమారుడు ధనుష్ తో కలిసి అద్దె ఇంట్లో నివాసం వుంటున్నారు. కారు డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న గౌతమ్ కు సొంతగా ఇంటిని నిర్మించుకునే స్థోమత లేదు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదల కోసం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నాడు.
Video
డబుల్ బెడ్రూం లబ్దిదారుల కోసం రెండు మూడు పర్యాయాలు ఎల్లారెడ్డిపేట లో సర్వే చేశారు అధికారులు. ఈ క్రమంలో డబుల్ బెడ్రూం ఇంటిని పొందడానికి అన్ని అర్హతలు వున్నాయని జాబితాలో గౌతమ్ పేరు చేర్చారు. చివరి నిమిషంలో ఈ జాబితా నుండి లబ్దిదారుల జాబితా నుండి పేరు తొలగించడంతో గౌతమ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
read more సిరిసిల్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం: లబ్దిదారులకు పట్టాలిచ్చిన కేసీఆర్
వెంటనే హైదరాబాదులో ఓ రైల్వే ఉద్యోగి వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్న గౌతమ్ సెలవు పెట్టి పదిరోజుల క్రితం ఎల్లారెడ్డిపేటకు వచ్చాడు. తనకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పించాలంటూ స్థానిక ప్రజాప్రతినిధుల ఇళ్ళ చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగాడు. ఎక్కడ కూడా ఇళ్లు ఇస్తామన్న హామీ లభించలేదు. దీంతో అతడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భార్య పిల్లలు నిద్రిస్తుండగా అద్దె ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం నిద్రలేవగానే భర్త వ్రేలాడుతూ కనిపించడంతో ప్రవళిక కన్నీరుమున్నీరుగా విలపించింది. గౌతమ్ మృతితో భార్య, రెండేళ్ల పాప, నాలుగేళ్ళ బాబు పెద్దదిక్కును కోల్పోయారని.... ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.