ఎల్బీనగర్ లో బోర్డు తిప్పేసిన కాలేజీ : విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం
ఒక్కొక్కరి నుండి 10 నుండి 50 వేలు వసూలు...
కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి బోర్డు తిప్పేసే ఏజన్సీలను చూశాం. చిట్టీల పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసే చిట్ ఫండ్ కంపెనీలను చూశాం. కానీ విద్యార్థుల నుండి పీజులు వసూలు చేసి బోర్డు తిప్పేసే కాలేజీలను ఎక్కడైనా చూశారా? అయితే మనం వెంటనే ఎల్బీ నగర్ కు వెళ్లాల్సిందే.
అసలేం జరిగిందంటే... ఎల్బీనగర్ కు చెందిన ఓ ప్రైవేట్ కాలేజి ఈ విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుండి అడ్మిషన్లు కోరింది. దీంతో కొంతమంది విద్యార్థులు ఆ కాలేజీ లో ముందస్తుగా సీటు కోసం 10 నుండి 50 వేల వరకు ఫీజులు చెల్లించారు. తీరా ఇపుడు తరగతులు ప్రారంభమయ్యే సమయానికి తమ కాలేజీకి అనుమతులు రాలేవంటూ సదరు కాలేజీ యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో అటు డబ్బులు అలాగే వదిలిపెట్టలేక, ఇటు తమ పిల్లలను వేరే కాలేజీలో చేర్పించలేక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇలా దీక్షా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యంతో ముందుగానే ఒక్కో సీటుకు లక్ష రూపాయల ఫీజు మాట్లాడుకున్నామని, కొంత మొత్తం అడ్వాన్స్ కూడా చెల్లించామని తల్లిదండ్రులు ఆవేధన చెందుతున్నారు. తీరా ఆపుడు విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి తమకు అనుమతి రాలేదని, మాదాపూర్ లోని తమ మరో కాలేజీకి విద్యార్థులను పంపుతామని చెబుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఇక్కడి నుండి మాదాపూర్ కి పిల్లల్ని ఎలా పంపుతామని తల్లిదండ్రలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం దీనిపై స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. లేదంటే తమ పిల్లల భవిష్యత్ పై ఈ ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.