లోటస్ పాండ్ లో ఐఏఎస్ కాలనీవాసి అనుమానాస్పద మృతి
బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ చెరువులో ఓ మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హైదరాబాద్: బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ చెరువులో సోమవారం తెల్లవారుజామున ఓ యువకుడు అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. తెల్లవారుజామున 5 గంటలకే ఇంట్లోంచి బయటకు వచ్చిన యువకుడు చెరువులో విగతజీవిగా కనిపించాడు. అయితే అతడిది హత్యా, ఆత్మహత్యా లేక ప్రమాదవశాత్తు చెరువలో పడ్డాగా అన్నది తెలియాల్సి వుంది.
వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ చెరువులో ఓ మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం వద్ద లభించిన వస్తువుల ఆదారంగా ఐఏఎస్ కాలనీకి చెందిన మహ్మద్ అహ్మదుద్దిన్(30) గా గుర్తించారు. ఈరోజు ఉదయం 5.30 గంటలకు ఇంట్లోంచి బయటకు వచ్చినట్లు మృతుడి సోదరుడు తెలిపాడు.
అహ్మదుద్దిన్ కు ఆత్మహత్య చేసుకునేంత ఆర్దిక, ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో అతడు ప్రమాదవశాత్తు చెరువులో పడ్డాడా లేక ఎవరైన హత్య చేసి చెరువులో పడేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఈ దిశగా దర్యాప్తు సాగించారు.