డేటా చోరీ: ఐటి గ్రిడ్ ఎండీ అశోక్ అరెస్టుకు రంగం సిద్ధం
ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈమేరకు దేశంలోని అన్ని ఎయిర్పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు.
హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ ను అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేశారు. లొంగిపోవడానికి సైబరాబాద్ పోలీసులు అతనికి ఇచ్చిన గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఈ వ్యవహారంలో మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుతో పాటు ఎస్సార్ నగర్, కేపీహెచ్బీ కేసుల దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదుచేసిన లోకేశ్వర్రెడ్డిని సైబరాబాద్ పోలీసులు మరోమారు విచారించినట్లు తెలిసింది.
ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈమేరకు దేశంలోని అన్ని ఎయిర్పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. దేశం విడిచి పారిపోకుండా అశోక్పై పోలీసులు ఎల్వోసీ జారీ చేశారు. ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే.