కేసీఆర్ వార్నింగ్ .. మారని బీఆర్ఎస్ నేతలు , దళితబంధులో భారీ అవినీతి : ఉత్తమ్కి బాధితుల ఫిర్యాదు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు దళితబంధు లబ్ధిదారుల వద్ద నుంచి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు చేశారు. దీనిపై బాధితులు కాంగ్రెస్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినా నేతల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు దళితబంధు లబ్ధిదారుల వద్ద నుంచి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు చేశారు. దీనిపై బాధితులు కాంగ్రెస్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
కాగా.. ఈ ఏడాది ఏప్రిల్లో బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. దళితబంధు పథకం విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. వసూళ్లకు పాల్పడ్డ ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద వుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇది తన చివరి వార్నింగ్ అని.. మళ్లీ వసూళ్లకు పాల్పడితే టికెట్ దక్కదని, పార్టీ నుంచి వెళ్లిపోవడమేనని ముఖ్యమంత్రి హెచ్చరించారు. మీ అనుచరులు తీసుకున్నా మీదే బాధ్యతని ఆయన హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం అవ్వాలని.. కేడర్తో అసంతృప్తి తగ్గించే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడమే మనకు ముఖ్యమని కేసీఆర్ అన్నారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానెల్ను కూడా నడపవచ్చని సీఎం సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట జెడ్పీ ఛైర్మన్లు, ఎంపీలను ఇన్ఛార్జీలుగా నియమిస్తామన్నారు. మూడు, నాలుగు నెలల్లో ఇన్ఛార్జీల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దాహం వేసినప్పుడే బావి తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదన్నారు.