సైదాబాద్ హత్యాచారం కేసు.. మఫ్టీల్లో పోలీసులు, నిందితుడి కోసం ముమ్మర గాలింపు: సీపీ స్టీఫెన్ రవీంద్ర
సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఎస్వోటీ, ఎస్బీ, లోకల్ పోలీసుల ప్రత్యేక బృందాలతో నిఘా వుంచినట్లు పేర్కొన్నారు. ఎవరికైనా నిందితుడి ఆచూకీ తెలిస్తే డయల్ 100కి సమాచారం అందించాలని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. డీజీపీ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తమయ్యాయని ఆయన తెలిపారు. సైబరాబాద్ కమీషనరేట్లోని అన్ని పీఎస్ల పరిధిలో మఫ్టీలో పోలీసులను మోహరించినట్లు స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఎస్వోటీ, ఎస్బీ, లోకల్ పోలీసుల ప్రత్యేక బృందాలతో నిఘా వుంచినట్లు పేర్కొన్నారు.
ఎవరికైనా నిందితుడి ఆచూకీ తెలిస్తే డయల్ 100కి సమాచారం అందించాలని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్గేట్స్, లాడ్జీల్లో ముమ్మరంగా గాలిస్తున్నట్లు స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పోలీసులతో అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సైబరాబాద్ పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలిస్తున్నామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
ALo Read:సైదాబాద్లో ఆరేళ్ల బాలికపై రేప్, హత్య: ఉప్పల్లో రాజు కదలికలను గుర్తించిన పోలీసులు
అటు సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసు నానాటికీ జఠిలమవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో డీజీపీ, హైదరాబాద్ సీపీలతో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సమావేశమయ్యారు. చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మహమూద్ అలీ మాట్లాడుతూ.. ఘటన విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్గా వున్నారని ఆయన తెలిపారు.
నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులును ఆదేశించారు. చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో కేసును విచారణ చేయాలని మహమూద్ అలీ ఆదేశించారు. చిన్నారిపై హత్యాచార ఘటన విషయంలో కేసీఆర్ బాధపడ్డారని.. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారని హోంమంత్రి తెలిపారు.