నైజీరియన్ చేతిలో మోసపోయిన హైదరాబాదీ మహిళ... డిల్లీలో యువకుడు అరెస్ట్
హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలా ఓ మహిళను మోసగించిన నైజీరియన్ వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు డిల్లీలో అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: టెక్నాలజీ పెరగడం మానవాళికి ఉపయోగకరమే అయినప్పటికి అదే టెక్నాలజీ చీటర్స్ కి అస్త్రంగా మారింది. ముఖ్యంగా నయా టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒక చోట సైబర్ క్రైమ్స్ బయటపడుతున్నాయి. ఇలా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా ప్రతినిత్యం సైబర్ చీటర్స్ చేతిలో చాలామంది మోసపోతున్నారు.
ఇటీవల హైదరాబాద్ బోయినిపల్లిలో నివాసముండే ఓ మహిళకు విలువైన బహుమతి వచ్చిందంటూ కాల్ వచ్చింది. నిజంగానే గిప్ట్ వచ్చిందని ఆనందించిన ఆమె వివిధ ఛార్జీల కింద రూ.16 లక్షలు చెల్లించింది. ఇలా డబ్బులు చెల్లించి చాలారోజులయినా గిప్ట్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేయగా నిందితుడు డిల్లీలో వున్నట్లు గుర్తించారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు డిల్లీకి వెళ్లి సైబర్ నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్ మైకేల్ ను అరెస్ట్ చేశారు.
read more రీల్ పోలీస్, రియల్ దొంగ... సినిమా కెమెరాలు దొంగిలించి జల్సాలు.. ఆ తరువాతే...
ఇదిలావుంటే లాటరీలో విలువైన కారు గెలుపొందారంటూ హైదరాబాద్ గోల్కొండ కు చెందిన అబ్దుల్ ముజీబ్ ఖాన్ కు కాల్ చేశారు సైబర్ చీటర్స్. నిజంగానే కారు గెలుచుకున్నానని భావించిన అతడిని వివిధ చార్జీల పేరిట రూ.17.35 లక్షలు వేయాలని ఛీటర్స్ కోరగా అలాగే చేశాడు. డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాక ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ అవడంతో మోసపోయానని గ్రహించిన అతడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ఇక ఆన్లైన్ ట్రేడింగ్ లో అధిక లాభాలు ఇస్తామని ఇద్దరు వ్యక్తుల నుండి 3.7 లక్షల కాజేశారు సైబర్ నేరగాళ్ళు. మోసపోయిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు. ఇలా నిత్యం అనేక మంది సైబర్ నేరగాళ్ళ వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.