రాజకీయ నేతలపై క్రిమినల్ కేసులు: తెలంగాణలో హరీష్, ఏపీలో జగన్ టాప్
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పలువురు రాజకీయ పార్టీల నేతలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కేసుల్లో తెలంగాణ నుండి హరీష్ రావు టాప్లో ఉన్నారు. ఏపీలో సీఎం జగన్ పై కేసులు ఎక్కువగా ఉన్నాయి.
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన నేతలపై పలు కేసులున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నేతలపై తెలంగాణ ఉద్యమం నాటి కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. మంత్రి హరీష్ రావుపై అత్యధికంగా 41 కేసులున్నాయి. ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్పై 38 కేసులు నమోదయ్యాయి.
రాజకీయాల్లో నేరచరిత్రుల పాత్ర అత్యధికంగా ఉండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా రాజకీయ పార్టీలు ఎందుకు నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను బరిలోకి దింపాల్సి వచ్చిందనే విషయాన్ని సోషల్ మీడియాతో పాటు ఈసీకి వివరించాలని సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఈ తరునంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలకమైన రాజకీయ నేతలపై పలు కేసులు విషయం మరోసారి తెరమీదికి వచ్చింది.
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన 51 మంది నేతలపై కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మందిపై కేసులున్నాయి. ఇక ఏపీ రాష్ట్రంలో వైసీపీకి చెందిన 86 మందిపై, టీడీపీకి చెందిన 15 మందిపై కేసులున్నాయి.
Also read:ఎన్నికల్లో క్రిమినల్స్: పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో పలు కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఉద్యమంలో జరిగిన నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే సాంకేతిక సమస్యలతో ఇంకా కొన్ని కేసులు కొనసాగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుపై అత్యధికంగా 41 కేసులు ఉన్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై 17 కేసులున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్పై 13 కేసులు నమోదయ్యాయి.
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కుపై 13, రోహిత్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యపై 8 కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురు కూడ ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై 5, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై 4, మంత్రి గంగుల కమలాకర్ పై 3, మాజీ మంత్రి దానం నాగేందర్ పై 4, మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై 4, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై 17, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై 9, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై 9 కేసులు ఉన్నాయి.
ఇక ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై 38 కేసులు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒక్క కేసు మాత్రమే ఉంది. వైసీపీకి చెందిన ఉధయ భానుపై 18 కేసులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై 15, దాడిశెట్టి రాజా పై 17, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై 7, కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 8, ఎంపీ విజయసాయిరెడ్డిపై 13, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై 6, ఆళ్ల రామకృష్ణారెడ్డిపై 7 కేసులు ఉన్నాయి. ఇక వైసీపీకి చెందిన ఎంపీలైన గోరంట్ల మాధవ్ పై 7, అవినాష్ రెడ్డిపై 4, రఘురామకృష్ణంరాజుపై 6 కేసులు ఉన్నాయి.
టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కరణం బలరాంపై 2, అనగాని సత్యప్రసాద్ పై4, అచ్చెన్నాయుడుపై1, వాసుపల్లి గణేష్ పై 3 కేసులు నమోదయ్యాయి.ఈ విషయాన్ని తెలుగు న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది.