ఎన్నికల్లో క్రిమినల్స్: పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు
ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న వారిని ఎందుకు బరిలోకి దింపాల్సి వచ్చిందనే విషయమై వెంటనే సోషల్ మీడియాతో పాటు ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: రాజకీయాల్లో క్రిమినల్ రికార్డులు ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. క్రిమినల్ రికార్డ్స్ ఉన్న అభ్యర్థులను ఎందుకు అభ్యర్ధులుగా బరిలోకి దింపాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలను కోరింది.ఈ మేరకు ఆయా పార్టీలు ఈ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాజకీయాల్లో నేరచరిత్ర ఉన్న అభ్యర్థుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై గురువారం నాడు విచారణ చేపట్టారు. ఈ విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభ్యర్థులు తమ నేరచరిత్రను ఎన్నికల సంఘానికి సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అత్యధికంగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు నేరచరిత్ర ఉండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యర్థుల క్రిమినల్ చరిత్రను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నేర చరిత్ర గల అభ్యర్ధులను ఎందుకు ఎన్నికల్లో నిలాపాల్సి వచ్చిందనే విషయమై ఎన్నికల సంఘానికి తొలుత అన్ని రాజకీయ పార్టీలు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో కూడ పెట్టాలని కూడ సుప్రీంకోర్టు అన్ని పార్టీలను కోరింది. నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను ఎందుకు బరిలో దింపాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పలేకపోతే కోర్టు ధిక్కారణ కిందకు వస్తోందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 72 గంటల్లోపుగా ఎన్నికల సంఘానికి ఈ సమాచారాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.