బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల సమస్యలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు సీపీఐ అగ్రనేత నారాయణ. పిల్లలకు నాసిరకం ఆహారం అందిస్తున్నారని.. హాస్టల్ నిర్వహణ వర్సిటీ అధికారుల చేతుల్లోనే వుండాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారని నారాయణ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల సమస్యలపై సీపీఐ అగ్రనేత నారాయణ (cpi narayana) స్పందించారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు (dharmendra pradhan) ఆయన ఆదివారం లేఖ రాశారు. విద్యార్ధులపై వేధింపులకు పాల్పడుతున్నారని నారాయణ తన లేఖలో ఆరోపించారు. పిల్లలకు నాసిరకం ఆహారం అందిస్తున్నారని.. హాస్టల్ నిర్వహణ వర్సిటీ అధికారుల చేతుల్లోనే వుండాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారని నారాయణ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ట్రిపుల్ ఐటీకి వెంటనే పూర్తి స్థాయి వీసీని నియమించాలని సీపీఐ నారాయణ కోరారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అంతకుముందు హైదరాబాద్‌లోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) ఇంటి ముందు ఆదివారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల తల్లిదండ్రులు సబిత ఇంటి ముందు బైఠాయించారు. తమ పిల్లల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామని పేరెంట్స్ మీడియాతో అన్నారు. పిల్లలు ఇబ్బందుల్లో వున్నారని.. తక్షణమే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విద్యార్ధుల పేరెంట్స్ హెచ్చరిస్తున్నారు. పోలీసులు తల్లిదండ్రుల ఆందోళనను అడ్డుకోవడంతో సబిత ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

ALso REad:సబిత ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల తల్లిదండ్రుల ఆందోళన

కాగా.. Basara IIT అధికారులు ఆదివారం నాడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలనే డిమాండ్ తో విద్యార్ధులు శనివారం నాడు రాత్రి నుండి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చదువుకునే విద్యార్ధులను అడ్డుకుంటే Show cause నోటీసులు జారీ చేస్తామని అధికారులు ప్రకటించారు. షోకాజ్ నోటీసులు జారీ చేసినా కూడా తీరు మారకపోతే వారిని ట్రిపుల్ ఐటీ నుండి బర్తరఫ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. 

ఇకపోతే.. శనివారం నాడు రాత్రి నుండి బాసర ట్రిపుల్ ఐటీలోని ఈ 1, ఈ 2 విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. మెస్ కాంట్రాక్టర్ ను తొలగించాలని ఆందోళన చేస్తున్నారు. శనివారం రాత్రి భోజనం మానేసి నిరసనకు దిగారు. ఆదివారం నాడు టిఫిన్ కూడా మానేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో ఇంచార్జీ వీసీ చర్చించారు. టెండర్ ప్రక్రియ పూర్తైన తర్వాత మెస్ కాంట్రాక్టర్ ను మార్చే అవకాశం ఉంటుందని వీసీ చెప్పారు