అర్థరాత్రి దంపతులను అటకాయించి.. మహిళను కారులో ఎక్కాలంటూ దాడి.. వీడియో వైరల్...
అర్థరాత్రి భర్తతో కలిసి వెడుతున్న మహిళపై యువకులు దాడికి దిగారు. కారులో బలవంతంగా ఎక్కించుకోవడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అర్ధరాత్రి భయంకరమైన ఘటన జరిగింది. ఓ దంపతులు అర్ధరాత్రి పూట బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి మీద యువకుల గుంపు దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జహీరాబాద్ పట్టణంలోని శాంతి నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఈ కాలనీకి చెందిన దంపతులు రాత్రి ఒంటిగంట సమయంలో బస్టాండ్ లో బస్సు దిగారు. నడుచుకుంటూ తమ ఇంటికి వెళ్తున్నారు. వీరిని గమనించిన కొంతమంది యువకులు వెంట పడ్డారు. బ్లాక్ రోడ్డులో దంపతులను అటకాయించారు.
ఆ తర్వాత మహిళను కారులో ఎక్కాలంటూ బలవంతం చేశారు. ఆమె మీద దాడికి దిగారు. భయంతో ఆమె కేకలు వేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిని అటకాయించిన యువకులు మద్యంమత్తులో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ ని వివరణ కోరగా.. దంపతులపై దాడి జరిగిన మాట వాస్తవమేనని.. దీనికి సంబంధించి ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ ఘటన మీద దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని అన్నారు. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లికి వెడుతూ బోల్తా పడ్డ ట్రాక్టర్.. ఆరుగురు మృతి..
అయితే, శాంతినగర్లో ఆదివారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను అటకాయించి, దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను జహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సబ్ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా జహీరాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని, దీనికి అభ్యంతరం చెప్పడంతో ఆమె భర్తను కొట్టారని.. ఆ వీడియో గుర్తించామన్నారు. మహ్మద్ సుఫియాన్, మహ్మద్ సమీర్ అనే ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.