తెలంగాణలో కరోనా విలయతాండవం... 60 పాజిటివ్ కేసులు, ఆరుగురి మృతి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ ఒక్కరోజే కరోనా బారినపడిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2499కి చేరింది.
తెలంగాణలో కేవలం స్థానిక కేసుల సంఖ్య 2068 గా వుంది. వలస కూలీలు, విదేశాల నుండి తిరిగివచ్చిన వారు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 431 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఇలాంటి వారికి ఇవాళ ఒక్కరోజే 14(వలసకూలీలు 9, విదేశాల నుండి వచ్చినవారు 5) మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2499కి చేరింది.
read more తెలంగాణలో కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజులో 169 మందికి పాజిటివ్: హైదరాబాద్లోనే 82 కేసులు
శనివారం అత్యధికంగా జీహెచ్ఎంసి పరిధిలో 41 కేసులు నమోదయ్యాయి. అలాగే రంగారెడ్డి 5, మహబూబ్ నగర్ 2, జగిత్యాల 2, సంగారెడ్డి 3, సూర్యాపేట 1, వనపర్తి 1, వరంగల్ అర్బన్ 1, వికారాబాద్ 1, మేడ్చల్ 1, నాగర్ కర్నూల్ 1, నిజామాబాద్ 1 నమోదయ్యాయి.
ఇప్పటివరకు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 1412గా వుంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 1010 యాక్టివ్ కేసులు వున్నాయి. వీరంతా గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.