నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఓటమి భయం పట్టుకుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన జిల్లాలోని ఏ స్థానం నుంచి పోటీ చేసినా ఓడిస్తానని తెలిపారు. తాను నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి, విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచే పోటీ చేస్తానని, ఈ సారి విజయం సాధించి తీరుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుం కవిత ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆమె బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ నుంచి మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఓటమి భయం పట్టుకుందని ఆమె అన్నారు. అందుకే ఈ సారి తనపై పోటీ చేయకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కవిత ఆరోపించారు.
ఈసారి కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కూడా అర్వింద్ భావిస్తున్నారని ఆమె తెలిపారు. అయితే నిజామాబాద్ జిల్లాలోని ఏ స్థానం నుంచి ఆయన పోటీ చేసినా కచ్చితంగా ఓడిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. గడిచిన తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గణనీయమైన పురోగతి సాధించామని కవిత అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ చెప్పుకోదగిన కృషి చేయలేదని విమర్శించారు.
నిజామాబాద్ లో కొత్తగా ప్రారంభించిన ఐటీ టవర్ ను అర్వింద్ చిన్నచూపు చూస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 750 మంది యువకుల్లో ఇప్పటికే 280 మందికి ఉద్యోగాలు కల్పించామని అన్నారు. ఇది సానుకూల ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని ఆమె పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, యువత స్పందించాలని ఆమె కోరారు.
ప్రేమ పెళ్లికి అడ్డువస్తాడని తండ్రి కాళ్లు విరగ్గొట్టించిన కూతురు.. ఏం చేసిందంటే?
లోక్ సభలో నిజామాబాద్ సమస్యలను అరవింద్ విస్మరించారని ఆమె ఆరోపించారు. జిల్లా, రాష్ట్ర సమస్యలను ప్రస్తావించకుండా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన ప్రసంగించారని, అందులో ఆయన అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కవిత ఆరోపించారు.
