రేవంత్ రెడ్డి ఏజెంట్గా మాణిక్కం ఠాగూర్.. : మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏజెంట్గా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ మారారని ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏజెంట్గా మారారని ఆరోపించారు. రేవంత్ సీనియర్లను గోడకేసి కొడతా అని కామెంట్ చేసినప్పటికీ అధిష్టానం మందలించలేదని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ రెడ్డి తీరు సరికాదని కామెంట్ చేశారు. పార్టీ నడిపిస్తున్నవారే కాంగ్రెస్లో కల్లోలానికి కారణమని అన్నారు. అయితే ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లడం, పార్టీలో అంతర్గత విభేదాలతో సతమతవుతున్న టీ కాంగ్రెస్లో.. మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మరింత రచ్చకు దారితీసే అవకాశం ఉంది.
ఇక, తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పినప్పటికీ.. ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనదైన స్టైలిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరోవైపు మాణిక్కం ఠాగూర్ వ్యవహారశైలిపైనా పార్టీలో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. సీనియర్ల అభిప్రాయాలు, సలహాలను పట్టించుకోకుండా కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే అనుకూలంగా వుంటున్నారని ఆయనపై కొందరు సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. దాసోజు శ్రవణ్ కూడా వెళ్తూ వెళ్తూ ఇదే రకమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఠాగూర్ తీరుతో చాలామంది నేతలు పార్టీని వీడిపోయే అవకాశాలు ఉన్నాయని.. వెంటనే ఆయన్ని తొలగించాలని అధిష్టానానికి ఫిర్యాదులు సైతం చేస్తున్నారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే మాణిక్కం ఠాగూరు నేడు హైదరాబాద్లో.. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికతో పాటు, పార్టీ అంతర్గత విభేదాలు చర్చిస్తున్నారు. ముఖ్య నేతలతో సమావేశం అనంతరం.. మునుగోడు నియోజకవర్గంలోని మండలాలకు ఇంచార్జ్లుగా నియమితులైన నేతలతో మాణిక్కం ఠాగూర్ సమావేశం కానున్నారు. ఇక, సాయంత్రం 5 గంటలకు డీసీసీ అధ్యక్షులతో మాణిక్కం ఠాగూర్ సమావేశం కానున్నారు.