కెసిఆర్ పై పది ప్రశ్నలు సంధించిన ఉత్తమ్
- టిఆర్ఎస్ లో ’కెసిఆర్ నెంబర్ వన్ సిమ్’ సంబురాలు మొదలు
- నెంబర్ వన్ బోగస్ , ఆ హోదా ఇచ్చిన సర్వే బోగసంటున్న కాంగ్రెస్
- నెంబర్ వన్ వైఫల్యాలలోనేమో : ఉత్తమ్కుమార్ రెడ్డి అనుమానం
తెలంగాణాలో మంత్రులు , టిఆర్ ఎస్ నాయకులు ’కెసిఆర్ నెంబర్ వన్ సిఎం’ సంబురాలు జరపుకుంటూంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ముఖ్యమంత్రి వైఫల్యాలను చూపిస్తూ నెంబర్ వన్ హోదా వైఫల్యాల కొచ్చిందేమో అని ఎద్దేవా చేస్తున్నారు. కెసిఆర్ వైఫల్యాలకు, ఎన్నికల హామీలను ఎగ్గొట్టినందుకు ఆయనకు ’నెంబర్ వన్ సిఎం’ గౌరవం అందించారేమో వారు ఎగతాళి చేస్తున్నారు. ఈ సర్వే బోగస్, ఈ సర్వే చేసిన సంస్థ బోగస్ అని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ మధ్య ఒక సర్వే సంస్థ దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరును సర్వే చేసి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కు మొదటి ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎనిమిదో ర్యాంకు ఇచ్చి తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టించింది. ఈ సర్వే తెలుగుదేశం పార్టీని బాగా ఇరుకున బెడితే, తెలంగాణా లో అధికార పార్టీలో దీపావళి తెచ్చింది. సోమ వారం నాడు పలుప్రాంతాలలో ’ నెంబర్ వన్ ’ సంబురాలు మొదలుపెట్టారు. డిప్యూటి సిఎం మహమూద్ అలీ నాయకత్వంలో హైదరాబాద్ వోల్డ్ సిటి ఏరియాలో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టిఆర్ ఎస్ కార్పొరేటర్లు, జిహెచ్ఎంపి డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్ధీన్ కూడా పాల్గొంటున్నారు. అక్కడ కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు.
ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రమంతా కూడా జరిపేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం.
ఈ లోపు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఈనెంబర్ వన్ ఏమిటి ఈ సంబురాలు ఏమిటని ప్రశ్నల పరంపర సంధించారు. సర్వే లో ఏ మాత్రం వాస్తవం లేదని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉంటే కెసిఆర్ పాపులర్ సిఎం ఎలా అవుతారో చెప్పాలని అడుగుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలివే :
- కెసిఆర్ ను దేశంలో ’నెంబర్ వన్ సిఎం ’గాఎంపిక అయిన సర్వే సంస్థ ఎవరో ఎవరిది?.
- పాపులర్ సీఎం ఎందుకు అయ్యారు? ప్రాతిపదిక ఏమిటి?
- నెంబర్ వన్ సిఎం ఎందుకయ్యారు-విద్యార్థుల ఫీజులు ఇవ్వనందుకా?
- డబుల్ బెడ్ రూమ్స్ కట్టివ్వనందుకా ?
- రైతులకు రుణమాఫీ అమలు చేయనందుకా ?
- అంతపాపులర్ సిఎం అయితే- పార్టీ మారిన ఎమ్మెల్యే ల చేత ఎందుకు రాజీనామా చేయించటం లేదు?
- జిహెచ్ఎంసీ లో వందల కోట్ల కుంభకోణానికి సమాధానం ఏమిటి?
- అప్పుల్లో, రాజకీయ ఫిరాయింపుల్లో, రైతుల ఆత్మహత్యాల్లో, ఎన్నికల హామీలను నిలబెట్టుకోపోవటంలో నెంబర్ వన్ అయ్యారా?
- పకడ్బందీగా ఉన్న భవనాలు కూల్చివేసి కొత్త సెక్రటేరియట్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నందుకా ?
- వాస్తు పేరిట పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నందుకా?