తెలంగాణ సీఎం కేసీఆర్‌కు  మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి బుధవారం నాడు లేఖ రాశారు.  రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 


హైదరాబాద్: కలెక్టర్ల సదస్సు సుమారు 12 గంటలు జరిగినా... రాష్ట్రంలో రైతాంగ సమస్యల పై కనీస ప్రస్తావన చేయని సీఎం వైఖరి పట్ల ఎంపీ రేవంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అన్నదాతల బలవన్మరణాలు, వారి కష్టనష్టాల పై సమీక్షించేందుకు ఓ ఐదు నిముషాలైనా సమయం దొరకలేదా అని ప్రశ్నించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బుధవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ సదస్సులో మీ మాటల గారడితో మరోసారి తెలంగాణ సమాజాన్ని ఊహాలోకంలో విహరింపజేసే ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యం అని విమర్శించారు. 

 నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ తాజా లెక్కల ప్రకారం అన్నదాతల బలవన్మరణాలలో మన రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, కర్నాటకలు మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. 

జనాభా నిష్ఫత్తి ప్రకారం ఆ రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం మొదటి స్థానంలో ఉన్నట్టే లెక్కతేల్చిందన్నారు. సగటున రోజుకు ముగ్గురు రైతుల బలవన్మరణాలకు పాల్పడటం తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదన్నారు.ఈ అధికారిక లెక్కలను చూస్తుంటే రైతుల విషయంలో మీరు చెబుతున్న మాటలన్నీ పచ్చి అబ్ధాలేనని స్పష్టమవుతోందన్నారు.

రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి, వాటిని నెరవేర్చలేదు. అందువల్ల ఈ మరణాలకు సీఎం బాధ్యత తీసుకోవాలన్నారు.రైతులను మోసం చేయడంలో రైతు సమన్వయ సమితులది ప్రత్యేక పాత్ర. దాన్ని రాజకీయ నిరుద్యోగులను సంతృప్తిపరిచే కేంద్రంగా మార్చేశారని విమర్శించారు.

మీరు ఇచ్చిన హామీలన్నింటికీ ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించాలి. అన్నదాతల ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు.ప్రభుత్వం స్పందించక పోతే త్వరలో రైతులను సంఘటితం చేసి ఉద్యమిస్తానన్నారు.