తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ప్రతి సాయంత్రం సీఎం ధరణి పోర్టల్ చూస్తారని .. ఎవరు ఎక్కడ.. ఏం కొన్నారు, అని చూస్తారని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దళితుల భూములపై వారికి పూర్తి హక్కులు ఇస్తామన్నారు ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ. ఆయన నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. మూడో రోజు యాత్ర మహబూబ్నగర్ జిల్లాలో ముగిసింది. అనంతరం శుక్రవారం రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. బీజేపీకి, టీఆర్ఎస్ మద్ధతు పలుకుతోందన్నారు. ఉభయ సభల్లో బీజేపీకి, టీఆర్ఎస్ మద్ధతుగా వుందని.. తెలంగాణలో రాజు పాలన వుందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
ప్రతి సాయంత్రం సీఎం ధరణి పోర్టల్ చూస్తారని .. ఎవరు ఎక్కడ.. ఏం కొన్నారు, అని చూస్తారని ఆయన ఆరోపించారు. ఎక్కడెక్కడ భూములు వున్నాయి.. ఎవరి భూములు లాక్కోవాలని చూస్తారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అటవీ హక్కుల చట్టంతో గిరిజనులకు తాము భూములు ఇచ్చామని.. తెలంగాణ ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటోందని ఆయన ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విధ్వంసం సృష్టిస్తోందని.. జీఎస్టీతో నష్టపోతున్నామని చేనేత కార్మికులు చెప్పారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీఎస్టీలో మార్పులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ మళ్లీ చేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ALso Read:టీఆర్ఎస్- బీజేపీలు రెండూ ఒకటే... ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే పని : పాదయాత్రలో రాహుల్
ఇకపోతే.. గుడిగండ్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో మోడీ, తెలంగాణలో కేసీఆర్లు అధికారంలో వున్నారన్నారు. తమిళనాడులో ప్రారంభమైన జోడో యాత్ర ఇవాళ తెలంగాణలో కొనసాగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పార్లమెంట్లో బీజేపీ ఏ బిల్లు పెట్టినా తూచా తప్పకుండా టీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు.
రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని ఆయన ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్ సమదూరం పాటిస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ అంటకాగుతున్నాయని.. రెండు పార్టీలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. రెండు పార్టీలు శాసనసభ్యులను కొనుగోలు చేస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టించాయని, టీఆర్ఎస్ పార్టీ మియాపూర్ లాండ్ స్కామ్కు పాల్పడిందని రాహుల్ ఆరోపించారు.
