సీఎం కేసీఆర్ పై సిబిఐ విచారణ: బిజెపికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ డిమాండ్
దాదాపు రూ.50వేల కోట్లతో చేపట్టిన ఈ పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.
జగిత్యాల: మిషన్ భగీరథ పధకంపై విచారణ జరిపించాలని బిజెపి నాయకులకు సూచించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దాదాపు రూ.50వేల కోట్లతో చేపట్టిన ఈ పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిబిఐ విచారణ జరిపించే దమ్ము బిజెపి నాయకులకు వుందా? అని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు.
మిషన్ భగీరథ కింద గ్రామాల్లో సరఫరా చేస్తున్న నీరు శుద్దిచేయడం లేదని... అందువల్లే ప్రజలు త్రాగునీటిగా ఉపయోగించడం లేదన్నారు. ఈ నీటిని బట్టలు ఉతకడం, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకే వినియోగిస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు.
read more ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం: శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం
మిషన్ భగీరథ కోసం ఖర్చు చేసినట్లు చెబుతున్న నిధులలో ప్రతి గ్రామంలోనూ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం వుండేదన్నారు. దీంతో స్వచ్చమైన నీరు ప్రజలకు అందేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక తనకు పిసిసి పదవి దక్కకపోవడంపైనా జీవన్ రెడ్డి స్పందించారు. రేసులో వున్నప్పటికి తెలంగాణ పిసిసి పదవి రాలేదని ఏమాత్రం బాధలేదని... పార్టీ అధిష్టానం, అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి వుంటానన్నారు. పార్టీ పటిష్టత కోసం కష్టపడేవారికి తప్పకుండా గుర్తింపు వుంటుందన్న నమ్మకం ఉందని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.