ఈ రోజు సాయంత్రం టీ కాంగ్రెస్ జూమ్ మీటింగ్.. పార్టీ నడిపే పద్దతి ఇది కాదని జగ్గారెడ్డి ఫైర్..!
తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణను రూపొందించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్ను ఏర్పాటు చేసింది. అయితే నేరుగా సమావేశం పెట్టకుండా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి విభేదాలు వెలుగుచూశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణను రూపొందించేందుకు పార్టీ నాయకత్వం ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్ను ఏర్పాటు చేసింది. అయితే నేరుగా సమావేశం పెట్టకుండా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. జూమ్ మీటింగ్కు ఆహ్వానించడానికి ఫోన్ చేసిన ఓ నేతతో గరం గరంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ సంభాషణ సందర్భంగా.. రాహుల్ పాదయాత్ర, రాష్ట్రంలో రాజకీయాలపై సమీక్ష చేసే సమయం కూడా పార్టీ నాయకులకు లేదా అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ నడిపే పద్దతి ఇది కాదని జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని.. టీఆర్ఎస్, బీజేపీలు దూకుడు మీద ఉంటే జూమ్ మీటింగ్లు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. జూమ్ మీటింగ్లతో ఏం ఉపయోగం ఏం ఉంటుందని ఫైర్ అయ్యారు.
ఇక, ప్రజా సమస్యలపై పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం తెలిపారు. శనివారం రోజున జూమ్ మీటింగ్ ద్వారా నేతలందరితో చర్చించి త్వరలో కాంగ్రెస్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ముందుగా రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో బడుగు బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.