తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అధికారం ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ చేతుల్లో వుండదని జగ్గారెడ్డి హెచ్చరించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కాంకు కవిత మహారాణి ఆరోపించారు. ప్రభుత్వం చేసే అవినీతిపై మాట్లాడితే తప్పా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు కేసీఆర్, కవితలకు ఊడిగం చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు కార్యాలయంలో పోలీసుల సోదాలు నిరసిస్తూ బుధవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టం తాము చెప్పినట్లు చేస్తే మీ పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు. రాత్రి పూట తనిఖీల పేరుతో దాడులు చేసి అక్కడున్న సిబ్బందిని, కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అధికారం ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ చేతుల్లో వుండదని జగ్గారెడ్డి హెచ్చరించారు.
కాగా... కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఇవాళ గాంధీ భవన్ కు చేరుకున్నారు. గాంధీ భవన్ నుండి నేతలు డీజీపీ కార్యాలయం వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు డీజీపీ ఆపీస్ వైపునకు వెళ్లకుండా గాంధీ భవన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అంతకు ముందు గాంధీ భవన్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్దం చేశారు.
ఇదిలావుండగా... పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ ను కాంగ్రెస్ పార్టీ నియమించుకుంది. కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సునీల్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. సునీల్ సూచనలు, సలహా మేరకు ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు. అయితే సునీల్ కు చెందిన కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు. అయితే సునీల్ కార్యాలయంలో తమ పార్టీకి చెందిన డేటాను చోరీ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పోలీసుల తీరును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.
