హుజూర్నగర్ ఉప ఎన్నికలు: మద్దతివ్వాలని కోదండరామ్ను కోరిన కాంగ్రెస్
హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్యేతర పార్టీలను కోరుతున్నాయి.
హైదరాబాద్: హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని టీజేఎస్ ను కాంగ్రెస్ పార్టీ కోరింది. మంగళవారం నాడు టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కలిసింది.
టీజేఎస్ చీఫ్ కోదండరామ్ తో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు గూడురు నారాయణరెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు మంగళవారం నాడు భేటీ అయ్యారు. హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను మట్టికరిపించేందుకు తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. అయితే ఈ విషయమై తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ చెప్పారు.
సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమన్నను వెంటనే విడుదల చేయాలని కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమన్నను సూర్యాపేటలో అరెస్ట్ చేయలేదని ఎన్నికల సంఘానికి సూర్యాపేట పోలీసులు తప్పుడు నివేదిక ఇచ్చారని కోదండరామ్ విమర్శించారు.
టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందునే భూమన్నను అరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్ చేసిన సర్పంచ్ సంఘం నేతలను వెంటనే విడుదల చేయాలని డీజీపీని కలవనున్నట్టుగా కోదండరామ్ ప్రకటించారు.