పీసీసీ కమిటీల నియామకంపై  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు.  ఇప్పటికే  కొండా సురేఖ, బెల్లయ్యనాయక్ లు  తమ పదవులకు రాజీనామాలు చేశారు.  

హైదరాబాద్: పీసీసీ కమిటీల నియామకంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో సోమవారంనాడు కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 10వ తేదీన పీసీసీ కమిటీలను నియమిస్తూ ఎఐసీసీ జాబితాను ప్రకటించింది. ఈ కమిటీల నియామకంపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ పదవికి ఈ నెల 11వ తేదీన రాజీనామా చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి పదవికి బెల్లయ్యనాయక్ రాజీనామా చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క నివాసానికి మాజీ మంత్రి కోదండరెడ్డి , మాజీ ఎంపీ వి. హనుమంతరావులు చేరుకున్నారు. ఓయూకు చెందిన విద్యార్ధి సంఘం నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పీసీసీ కమిటీల్లో ఎవరెవరికి అన్యాయం జరిగిందనే విషయమై చర్చించనున్నారు. ధరణితో పాటు ఇతర సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డి అధ్యయనం చేశారు. ఈ మాసంలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాల్లో ధరణితో పాటు ఇతర అంశాలను లేవనెత్తాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ధరణి విషయంలో తాము అధ్యయనం చేసిన అంశాలను మాజీ మంత్రి కోదండరెడ్డి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు వివరించనున్నారు.

also read:నా కంటే జూనియర్లకు స్థానం... నాకిది అవమానమే , టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో 18 మందికి చోటు కల్పించారు. 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించారు. 24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులను నియమించారు. అయితే తనకంటే జూనియర్లకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చోటు కల్పించడంపై మాజీ మంత్రి కొండా సురేఖ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని ఆమె ప్రకటించారు. ఎఐసీసీ నాయకత్వానికి కొండా సురేఖ నిన్న లేఖను పంపారు.