భట్టి నివాసంలో కాంగ్రెస్ నేతల కీలక సమావేశం.. పీసీసీ కమిటీలపై చర్చ.. హాజరైన సీనియర్లు..
తెలంగాణ కాంగ్రెస్లో కొత్త కమిటీల ప్రకటన చిచ్చు రేపింది. పలువురు సీనియర్ నేతలు కమిటీల నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్లో కొత్త కమిటీల ప్రకటన చిచ్చు రేపింది. పలువురు సీనియర్ నేతలు కమిటీల నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలుత కొండా సురేఖ, బెల్లయ్య నాయక్ వంటి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. పీసీసీ కమిటీలకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీనియర్ల పేర్లు లేవని, సామాజిక సమతుల్యత లోపించిందని కొందరు తనతో చెప్పారని భట్టి వెల్లడించారు. తన దృష్టికి వచ్చిన అంశాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. దీంతో కొత్త కమిటీల చిచ్చు మరింత రాజుకుంది.
ఈ క్రమంలోనే పలువురు సీనియర్ నేతలు భట్టి విక్రమార్కను కలిసి వారి అభిప్రాయాలను తెలియజేశారు. మరోవైపు సీనియర్ నేత దామోదర రాజనర్సింహ పార్టీలో కోవర్టులు ఉన్నారనే కామెంట్స్ మరింత చర్చనీయాంశంగా మారింది. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ తీరుపై పలువురు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా శనివారం హైదరాబాద్లోని భట్టి విక్రమార్క నివాసంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మహేశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి, జగ్గారెడ్డి, దామోదర్ రాజనర్సింహ, కోదండరెడ్డి, ప్రేమ్ సాగర్ హాజరయ్యారు. మరికొందరు నేతలు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ కొత్త కమిటీలు, పార్టీ పరిస్థితిపై నేతలు చర్చిస్తున్నారు. టీపీసీసీ కమిటీలపై నేతల్లో నెలకొన్న అసంతృప్తిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని వీరంతా యోచిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లాలని కూడా వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం సీనియర్ నేతల ఢిల్లీ పర్యటనపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.