బీజేపీ అభ్యర్థుల లిస్టు ఎంపిక చేసిన కేసీఆర్....నిజమా!
టీఆర్ఎస్,బీజేపీలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుపార్టీలు ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆరోపించారు. విభజన హామీలు అమలు చెయ్యకపోయినా బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ సహకరించిందని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్కు వస్తున్నారని ప్రశ్నించారు.
హైదరాబాద్: టీఆర్ఎస్,బీజేపీలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరుపార్టీలు ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆరోపించారు. విభజన హామీలు అమలు చెయ్యకపోయినా బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ సహకరించిందని విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్కు వస్తున్నారని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అమిత్ షా కంటే మందు ఏసీబీ, ఈడీ అధికారులు వస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ-టీఆర్ఎస్లు కావాలనే కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నాయని మండిపడ్డారు. 119 స్థానాలలో పోటీ చేయడానికి బీజేపీకి అభ్యర్థులే లేరని, అందుకే టికెట్లు రాని వేరే పార్టీలలోని సభ్యులను తమ పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీకి వంద స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ-ఆపద్దర్మ సీఎం కేసీఆర్ ఇద్దరూ కలిసి పనిచేస్తున్న మాట వాస్తవమనిన్నారు. మోదీ కేసీఆర్ లది ఫెవికాల్ బంధం అన్నారు. గతంలో గజ్వేల్ సభలో కేసీఆర్, నరేంద్ర మోదీ పరస్పరం పొగుడుకున్నారని గుర్తు చేశారు.
ఇద్దరు పరస్పర అంగీకారంతోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పరిపాలనను కేంద్ర మంత్రులు అభినందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే టీఆర్ఎస్కు ఓటు వేసినట్లేనని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థుల లిస్టు కూడా కేసీఆరే రెడీ చేసి అమిత్ షాకు పంపించారని ఆరోపించారు.
మరోవైపు బీజేపీ-టీఆర్ఎస్ నేతలు ఉదయం తిట్టుకుంటారని సాయంత్రం కలుసుకుంటారని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ గురించి బీజేపీకి కేసీఆర్ ముందే చెప్పారని, దానికి మోదీ-షాలు మద్దతిచ్చారని వివరించారు.
తెలంగాణలో బలహీనవర్గాలకు చెందిన బండారు దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి కావాలనే తప్పించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు వచ్చిన లాభమేమిలేదని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.