ఒక్క ఛాన్స్... అలా కాకుంటే ఓటెయ్యకండి: హుజురాబాద్ ఓటర్లతో కౌశిక్ రెడ్డి
గతంలో కాంగ్రెస్ తరపున ఫోటీ చేసి ఈటల చేతిలో ఓటమి పాలయిన కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి మరోసారి హుజురాబాద్ లో ఫోటీకి సిద్దమయ్యారు.
కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ లో ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఈ నేపథ్యంలోనే గతంలో కాంగ్రెస్ తరపున ఫోటీ చేసి ఈటల చేతిలో ఓటమి పాలయిన కౌశిక్ రెడ్డి మరోసారి ఫోటీకి సిద్దమయ్యారు. వచ్చే రెండు సంవత్సరాల తనకు అవకాశం ఇవ్వాలని... అభివృద్ధి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటేయకండి అంటూ హుజురాబాద్ ఓటర్లను కోరుతున్నాడు.
''హుజూరాబాద్ నియోజక వర్గంలో ఒక్క డబల్ బెడ్ రూం ఇవ్వకుండా ఐదు ఎకరాలలో గడి కట్టుకున్న దొర ఈటల. ఆయన ప్రజల కోసం రాజీనామా చేయలేదు... అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి కేసీఆరే బయటకి పంపారు'' అన్నారు.
''కాంగ్రెస్ పార్టీ పక్షాన హుజూరాబాద్ ను జిల్లాగా ప్రకటించాలి అని డిమాండ్ చేస్తున్నా. జిల్లా కోసం ఉద్యమం చేస్తుంటే నీతి జాతి ఉద్యమం అన్న మాట వాస్తవం కాదా... కమ్యూనిస్ట్ గా ఉన్న మాజీ మంత్రి ఈటల బిజెపిలో ఎలా చేరాడు. తన అస్థిని కాపాడుకోవడానికి బిజెపిలో చేరారు'' అని ఆరోపించారు.
read more హుజూరాబాద్పై ఫోకస్: పట్టు కోసం టీఆర్ఎస్ ప్లాన్ ఇదీ...
''ఈటలకు వేల ఎకరాల భూమి ఎక్కడ నుండి వచ్చాయ్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసేసి ప్రైవేట్ పరం చేసిన పార్టీ లో ఎలా చేరతావు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వ్యాక్సినేశన్ బయటి దేశాలకు అమ్ముకున్నారని చెప్పిన మీరు బిజెపి లో ఎలా చేరారు'' అని ప్రశ్నించారు.
''ఆత్మ గౌరవం అంటున్న ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో ఉన్న ఉద్యమకారులను ఎందుకు పట్టించుకోలేదు. మంత్రిగా ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు మీ స్వంత కులస్థులకు మిగతా బిసిలకు ఏదయినా ఉపాధి కల్పించావా..? ఎన్నికల ముందు బిసి లకు లోన్లు ఇస్తామని హామీ ఏమయింది? హుజూరాబాద్ పట్టణం లో మిషన్ భగీరథ పనులు ఎందుకు పూర్తి కాలేదు?'' అంటూ నిలదీశారు.
''హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది. గత ఎన్నికల్లో నాకు 60 వేల ఓట్లు వేసిన అందరికీ ధన్యవాదాలు.రాబోయే ఉప ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పి ప్రజలకు కావలసిన అన్ని అవసరాలు తీరుస్తా'' అని కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.