20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేస్తాం.. కేసీఆర్ కాపలా వున్నా సరే, ప్లాన్ రెడీ : జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్దంగా వున్నారని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేల వద్ద కేసీఆర్ కాపలాగా వున్నా.. లాగేస్తామని, ప్లాన్ రెడీ అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి చెందకుండా కేసీఆర్ , జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
![congress leader jagga reddy sensational comments on brs mlas ksp congress leader jagga reddy sensational comments on brs mlas ksp](https://static-ai.asianetnews.com/images/01cyh0g34xykmd9jtz7ec3f2kt/SANGAREDDY-Jagga-Reddy_363x203xt.jpg)
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్దంగా వున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపే వీరిని పార్టీలోకి ఆహ్వానిస్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన మధ్య ఎంతో వ్యత్యాసం వుందని.. బీఆర్ఎస్ నేతలు ఏనాడూ సచివాలయానికి రాలేదని, ఇంటి నుంచి పాలన చేసేవారని దుయ్యబట్టారు. మోడీ కనుసన్నల్లోనే జగన్, కేసీఆర్ పనిచేస్తున్నారని.. తెలంగాణ అభివృద్ధి చెందకుండా కేసీఆర్ , జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వుండదని వ్యాపారులను కేసీఆర్, కేటీఆర్ భయపెడుతున్నారని.. వారి ఎత్తులను తిప్పికొడతామని జగ్గారెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేల వద్ద కేసీఆర్ కాపలాగా వున్నా.. లాగేస్తామని, ప్లాన్ రెడీ అయ్యిందని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో వుంటుందని, తర్వాతి ఐదేళ్లు కూడా తామే వుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారని.. ఆయనతో మాట్లాడిస్తోంది ఎవరని జగ్గారెడ్డి ప్రశ్నించారు.