కేసులకు భయపడేది లేదు: గండ్ర వెంకటరమణారెడ్డి
తనతో పాటు తన సోదరుడిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తప్పుబట్టారు
హైదరాబాద్: తనతో పాటు తన సోదరుడిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తప్పుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడితే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
బుధవారం నాడు ఆయన హైద్రాబాద్లో మీడియాతో మాట్లాడారు. కేసులతో కాంగ్రెస్ పార్టీ నేతలను భయపెట్టాలని చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కేసులకు భయపడమన్నారు. తన సోదరుడి క్రషర్ వద్దకు వచ్చిన రవీందర్ రావు అనే వ్యక్తి తన సోదరుడిని చంపుతానని బెదిరించాడని .. ఈ విషయమై కేసు ఫిర్యాదు చేస్తే తన సోదరుడితో పాటు తనపై కేసు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు.
తనతో పాటు తన సోదరుడి ఆయుధం కూడ పోలీస్ స్టేషన్ లోనే 2015లోనే డిపాజిట్ చేసినట్టు చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలను చూసి పోలీసులను వాకబు చేస్తే పొంతనలేని సమాధానాలు ఇచ్చారని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు.
తాను భూపాలపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నట్టు చెప్పారు. అయితే పోలీసులు తమపై ఒత్తిళ్లు ఉన్నాయని తనకు చెప్పారని గండ్ర తెలిపారు. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని ఆయన కోరారు.
జగ్గారెడ్డిపై 2004లో నమోదైన కేసు విషయంలో అరెస్ట్ చేశారని చెప్పారు. ఇదే ఆరోపణలు కూడ దివంగత ఎంపీ నరేంద్ర, సీఎం కేసీఆర్ పై కూడ ఉన్నాయని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు.
రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం లాంటి పరిణామాలను చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడితే వారిపై కేసులు నమోదు చేసి మానసికంగా హింసించేందుకు కేసీఆర్ సర్కార్ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. డీజీపీ చొరవ తీసుకోని పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చూడాలని ఆయన కోరారు.