కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు...: గోనె ప్రకాష్ రావు సంచలనం (video)
కరీంనగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ కుమ్మకయి క్యాంప్ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన కామెంట్స్ చేసారు.
పెద్దపల్లి: తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న అవినీతి పాలనకు చమరగీతం పడాలంటే ప్రతిపక్ష పార్టీలన్ని ఏకం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (gone prakash rao) సూచించారు. ముఖ్యంగా కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నిక (karimnagar mlc election) లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ (ravinder singh) కు ఓటేసి గెలిపించాలని ప్రకాష్ రావు స్థానిక సంస్థల ఓటర్లను కోరారు.
సోమవారం పెద్దపల్లి జిల్లా (peddapalli district) కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రావు మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ (trs party)ని బిసిలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వెయ్యరు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బిసి నేతలు అధికార పార్టీకి ఓటేసే అవకాశం లేదన్నారు.
VIDEO
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన వివిధ హామీలను నెరవేర్చలేదని గోనె ఆరోపించారు. ఇక గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన 12ఏళ్ళ కాలంలో భానుప్రసాద్ ఎమ్మెల్సీ ఎంపీటీసీ, జడ్పిటిలకు అన్యాయం చేసారన్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులు బాగా ఆలోచించి ఓటేయాలని సూచించారు. తాను మాత్రం రవీందర్ సింగ్ కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నట్లు ప్రకాష్ రావు తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కయి క్యాంప్ రాజకీయాలు చేస్తోందని ప్రకాష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ, జడ్పిటిసిలు ఎందుకోసం క్యాంపుకు వెళ్లారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడు విజయ రమణరావు అధికార టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయాడని ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు.
గతంలో హుజురాబాద్ ఉపఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ (eatala rajender) కు గోనె ప్రకాష్ మద్దతిచ్చారు. ఈటలను గెలిపించాలని ఆయన స్థానిక ప్రజలను కోరిన విషయం తెలిసిందే. కరోనా కాలంలో అలుపెరుగకుండా శ్రమించిన వ్యక్తి ఈటెల అని ప్రశంసించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు కూడా ఈటలకే మద్దతిస్తారని ఆయన అన్నారు. ఆయన అన్నట్లుగానే జరిగి ఈటల గెలుపొందారు.
ఇదిలావుంటే ఎమోషనల్ గా టీఆర్ఎస్ పార్టీ ఓటర్ల మనసులు గెలుచుకుని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న రవీందర్ సింగ్ ఇతర పార్టీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇందుకోసం ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని కలిసి ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని కోరారు. అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కూడా కలిసి మద్దతు కోరారు.
కాంగ్రెస్ అభ్యర్ధి బరిలో లేనందున తనకు అనుకూలంగా ఓట్లు వేయించాలని వీరిని రవీందర్ సింగ్ ఆభ్యర్థించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బరిలో నిలిచిన తనకు అండగా నిలిచి తన గెలుపునకు సహకరించాలని రవీందర్ సింగ్ కోరారు. దీనిపై ఇద్దరు నేతలతో కొద్దిసేపు చర్చించగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.