దళిత గిరిజన దండోరా: కోమటిరెడ్డి అలక.. ఇబ్రహీంపట్నానికి బదులు మహేశ్వరానికి మారిన వేదిక
తనకు చెప్పకుండా ఇబ్రహీంపట్నంలో దళిత గిరిజన దండోనా సభ నిర్వహించడంపై టీ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలకబూనారు. పార్లమెంటరీ కమిటీ పర్యటన ఉన్నందున ఈనెల 18న నిర్వహించనున్న సభకు హాజరుకాలేనని తెలియజేశారు. సాధ్యమైనంత వరకు సభను వాయిదా వేసుకోవాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు
ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ విజయవంతం కావడంతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ జోష్లోనే ఇబ్రహీంపట్నంలో మరో సభ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఇబ్రహీంపట్నంలో ఈనెల 18న నిర్వహించనున్న ఈ సభ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మాట్లాడిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. పార్లమెంటరీ కమిటీ పర్యటన ఉన్నందున ఈనెల 18న నిర్వహించనున్న సభకు హాజరుకాలేనని తెలియజేశారు. సాధ్యమైనంత వరకు సభను వాయిదా వేసుకోవాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 21వ తేదీ తర్వాత సభ ఎప్పుడు పెట్టినా హాజరయ్యేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో సభ వేదికను ఇబ్రహీంపట్నం నుంచి మహేశ్వరానికి మారుస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది.
ALso Readపోలీసు అనుమతి నిరాకరణ... ఇబ్రహీంపట్నం దళిత గిరిజన దండోరా సభా స్థలం మార్పు
కాగా, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలను విజయవంతం చేసేందుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీకి చెందిన నాయకులను స్థానిక నేతలతో సమన్వయం చేసుకునేందుకు సమన్వయకర్తలను నియమించింది. రెండు రోజుల కిందట రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియమించారు. వారందరికీ దిశానిర్దేశం చేసేందుకు శుక్రవారం సాయంత్రం ఇందిరా భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులు, సీనియర్ నేతలు పాల్గొని నియోజకవర్గ సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.