మహబూబ్నగర్ పార్లమెంట్ నుండి వంశీచంద్ రెడ్డి: తొలి అభ్యర్ధిని ప్రకటించిన కాంగ్రెస్
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మహబూబ్ నగర్ నుండి బరిలోకి దిగే అభ్యర్ధిని ఆ పార్టీ ప్రకటించింది.
![Congress announces Challa vamshi chand Reddy name as Mahabubnagar parliament Candidate lns Congress announces Challa vamshi chand Reddy name as Mahabubnagar parliament Candidate lns](https://static-ai.asianetnews.com/images/01cy3ke67av4rbde8n5qcfxm9q/vamshi_363x203xt.jpg)
మహబూబ్ నగర్: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది. అయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగే అభ్యర్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 309 మంది ధరఖాస్తు చేసుకున్నారు.ఈ ధరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి కాంగ్రెస్ నాయకత్వం పార్టీ స్క్రీనింగ్ కమిటీ ముందుంచింది. రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు ఈ విషయమై స్క్రీనింగ్ కమిటీతో చర్చించారు. గెలిచే అవకాశాలున్న అభ్యర్థులకే టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ నాయకత్వం అన్వేషిస్తుంది.
ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా బుధవారం నాడు కోస్గిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి బరిలోకి దిగనున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి 50 వేల మెజారిటీని ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.
2023 నవంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వంశీచంద్ రెడ్డి పోటీ చేయలేదు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి వంశీచంద్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపనుంది. గతంలో కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.
2023 నవంబర్ మాసంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహలు రచిస్తుంది.ఈ క్రమంలోనే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జీలను కాంగ్రెస్ నియమించింది. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. దక్షిణాదిలో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది.