క్రైసిస్: హైదరాబాదుకు మారిన కర్ణాటక రాజకీయం
తమ శాసనసభ్యులను కాపాడుకునే ప్రయత్నాలను కాంగ్రెసు, జెడి(ఎస్) నేతలు ముమ్మరం చేశారు.
హైదరాబాద్: తమ శాసనసభ్యులను కాపాడుకునే ప్రయత్నాలను కాంగ్రెసు, జెడి(ఎస్) నేతలు ముమ్మరం చేశారు. బెంగళూరులోని హోటల్లో ఇంత వరకు శాసనసభ్యులు ఉన్నారు. అక్కడ ఉంటే రక్షణ కల్పించలేమనే భావనతో వారిని హైదరాబాదు తరలిస్తున్నారు.
తొలుత కొచ్చిన్ కు తరలించాలని అనుకున్నారు. కానీ, తమ ఆలోచనను మార్చుకుని హైదరాబాదుకు తరలిస్తున్నారు. వారంతా బస్సుల్లో హైదరాబాదు బయలుదేరారు.
హైదరాబాదులోని ప్రముఖ హోటళ్లలో వారికి బస ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేల తరలింపును జెడిఎస్ ఎమ్మెల్యే థామస్ ధృవీకరించారు.
కర్నూలు మార్గంలో ఎమ్మెల్యేలంతా హైదరాబాదుకు చేరుకుంటున్నారు. శర్మ, ఎస్ఆర్ ఎస్ ట్రావెల్స్ బస్సుల్లో వారు హైదరాబాదు వస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తమకు మిత్రుడనే భావనతోనే కాంగ్రెసు, జెడిఎస్ పెద్దలు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.