ప్రగతి భవన్ ఖాళీ చేయాలని కోరిన కలెక్టర్ ఆమ్రపాలి
వేరే భవనాల వేటలో అధికారులు...
వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల వేగాన్ని పెంచాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణ ప్రాంతంలో వున్న ప్రగతి భవన్ ను వెంటనే ఖాళీ చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల చివరి ఇందులోని కార్యాలయాలను వేరే చోటికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
వరంగల్ అర్భన్ కలెక్టరేట్ భవనాన్ని 40 కోట్ల వ్యయంతో అన్ని కార్యాలయాలు ఒకే చోట వచ్చేలా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్మాణంలో బాగంగా ప్రగతి భవన్ కూల్చాల్సి వస్తోంది. దీంతో ఆ భవనాన్ని ఖాళీ చేయాలని కొద్దిరోజులుగా కాంట్రాక్టర్ చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో తాజాగా కలెక్టర్ ఈ విషయంలో కలుగజేసుకుని ఖాళీ చేయాలని ఆదేశించడంతో అధికారులు అందులోని కార్యాలయాలను తరలించే పనిలో పడ్డారు.
ఈ భవనాన్ని 1990 లో నిర్మించినప్పటికి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇందులో ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన 11 కార్యాలయాలు కొనసాగుతున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యాలయాలన్ని ఉరుగు పరుగులతో వేరే చోటికి తరలి పోతున్నాయి.