తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పలు జిల్లా పర్యటనకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 11న కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, కొత్తగా నిర్మించిన టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పలు జిల్లా పర్యటనకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 11న కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత జనగామ జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్.. తర్వాత యదాద్రి భువనగిరి, నిజామాబాద్, హన్మకొండ, జగిత్యాల, వికారాబాద్.. జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంది. జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరేట్లతో పాటు టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. అయితే గతంలో సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేపట్టాలని భావించిన.. పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి జిల్లాల పర్యటనను విజయవంతంగా పూర్తి చేయాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఈ నెల 11న జనగామ (Jangaon) జిల్లాలో పర్యటించనున్న కేసీఆర్.. జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, కొత్తగా నిర్మించిన టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏరాట్లపై జిల్లా కలెక్టర్ శివలింగయ్య, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao), ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. హన్మకొండ రోడ్డులో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ నూతన కార్యాలయం వద్ద బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. 

తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జిల్లా అభివద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం రివ్యూ చేపడతారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ జరిగే సభలో పాల్గొననున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇక, 12వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. అక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.