ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొన్న కేసీఆర్
లష్కర్ బోనాలను పురస్కరించుకొని తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు ఆదివారం నాడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొన్నారు
హైదరాబాద్: లష్కర్ బోనాలను పురస్కరించుకొని తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు ఆదివారం నాడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబసభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రికి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు స్వాగతం పలికారు. మంత్రులు, దేవాదాయశాఖాధికారులు దగ్గరుండి సీఎంను ఆలయంలోకి తీసుకెళ్లారు.
సీఎం ఆలయానికి వచ్చిన సమయంలోనే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ అమ్మవారిని దర్శించుకొనేందుకు ఆలయానికి వచ్చారు.బోనాలు సమర్పించుకొనేందుకు భక్తులు భారీగా ఆలయం వద్ద క్యూ లైన్లలో ఎదురుచూస్తున్నారు. దీనికితోడు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పీసీసీ చీఫ్ లాంటి విఐపీలు ఆలయానికి ఒకేసారి రావడంతో అధికారులు కొంత ఇబ్బందిపడ్డారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే ఉద్దేశ్యంతో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకొనేందుకు ఆలయం వద్ద భక్తులు పోటెత్తారు.