నూతన వ్యవసాయ పాలసీపై ఈ నెల 21న కేసీఆర్ కీలక మీటింగ్
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు ఈ నెల 21న మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు ఈ నెల 21న మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్.
ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా చర్చించి జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటల సాగుపై చర్చిస్తారు.
also read:ఇష్టమొచ్చిన పంటలు వేస్తే రైతుబంధు కట్: రైతులకు కేసీఆర్ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి? వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలి? అనే విషయాలను ఖరారు చేసేందుకు మంగళ, బుధవారాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయాధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు సమావేశాలు జరుపుతున్నారు.
ఈ సమావేశం అనంతరం జిల్లాల వారీగా పంటల మ్యాప్ ను రూపొందిస్తారు. ఆ పంటల మ్యాప్ పై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో చర్చించి, ఎక్కడ ఏ పంట వేయాలో నిర్ణయిస్తారు.
రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఈ ఖరీఫ్ సీజన్ నుండి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అంతేకాదు ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు పంటలు వేయాలని ప్రభుత్వం సూచించింది.
రానున్న రోజుల్లో కూడ రైతులతో కూడ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు పంటలు వేయని రైతులకు రైతు బంధు పథకం ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.