Asianet News TeluguAsianet News Telugu

ఇష్టమొచ్చిన పంటలు వేస్తే రైతుబంధు కట్: రైతులకు కేసీఆర్ హెచ్చరిక

ప్రభుత్వం సూచించిన పంటలు కాకుండా ఇష్టమొచ్చిన పంటలు వేస్తే రైతుబంధు కట్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను హెచ్చరించారు

telangana cm kcr suggestions to farmers
Author
Hyderabad, First Published May 18, 2020, 8:52 PM IST

ప్రభుత్వం సూచించిన పంటలు కాకుండా ఇష్టమొచ్చిన పంటలు వేస్తే రైతుబంధు కట్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను హెచ్చరించారు. రైతులకు ఉచిత నీటి సరఫరా ఒక్క తెలంగాణలోనే ఉందని సీఎం పేర్కొన్నారు.

కొన్ని రకాల అరుదైన పండ్లకు తెలంగాణ కేంద్రంగా ఉందని, ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక దేశ చరిత్రలో లేనివిధంగా రైతు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని సీఎం చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను దేశంలోని అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని కేసీఆర్ తెలిపారు.

నీటిపారుదల ప్రాజెక్టుల ఫలాలు మనం చూస్తున్నాం.. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ మన దగ్గర ఉందన్నారు. వేలాది పాడిపశువులు పంపిణీ చేసి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని.. అధునాతన పద్ధతుల్లో పంటలు పండించేందుకు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టామని కేసీఆర్ స్పష్టం చేశారు.

5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌‌ను ఏర్పాటు చేసిన ఘనత తమ రాష్ట్రానిదేనని ఆయన అన్నారు. రైతాంగం నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలని... తెలంగాణలో కాటన్ పంటకు అద్భుతమైన భవిష్యత్‌ ఉందని, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలే వేయాలని కేసీఆర్ అన్నారు.

70 లక్షల ఎకరాల్లో పత్తిపంటను పండించాలని.. గతంలో 53 లక్షల ఎకరాల్లో పత్తి పండించారని అన్నారు. ఈ సారి 70 లక్షల ఎకరాల్లో వేయాలని.. ప్రభుత్వం చెప్పినట్లు పంటలు వేసి మంచి ధరను రైతు పొందాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

వ్యవసాయంలో మనం అన్ని రికార్డులను బద్ధలుకొడుతున్నామని.. పాలిహౌజ్, గ్రీన్‌హౌజ్ కల్టివేషన్‌కు సబ్సిడీలు ఇస్తున్నామని కేసీఆర్ వివరించారు. ఏ పంటను ఎలా, ఎప్పుడు పండించాలనేది ప్రభుత్వమే చెబుతుందని సీఎం స్పష్టం చేశారు. వరిలో ఏఏ రకాలు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలని కేసీఆర్ రైతులను కోరారు.

వర్షాకాలంలో మక్క పంటకు బదులుగా కందులు వేయాలని సీఎం సూచించారు. తెలంగాణ సోనాకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉందని, తెలంగాణ సోనాకు షుగర్ ఫ్రీ రైస్ అని పేరుందన్నారు. వేసవిలో మక్కలు పండించాలని, సన్న రకాల్లో తెలంగాణ సోనా మంచిదని కేసీఆర్ గుర్తుచేశారు.

40 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేద్దామని.. 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు పండించాలని, నిజామాబాద్, జగిత్యాలలో పసుపు పంట వేసుకోవచ్చున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సోయాబిన్‌ వేయాలన్నారు. వరి పంటలో తెలంగాణ సోనా  రకం పండించాలని, 10 లక్షల ఎకరాల్లో పండించాలని కేసీఆర్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios